త్రిశంకుస్వర్గంలో భాషోపాధ్యాయులు
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:33 AM
గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారులు అత్యుత్సాహంతో భాషోపాధ్యాయ (లాంగ్వేజ్ పండిట్లు) కేడర్ను రద్దు చేయడంతో వారంతా ఆరేళ్ల నుంచి త్రిశంకుస్వర్గంలో ఉండిపోయారు.

వైసీపీ హయాంలో కేడర్ రద్దుతో ఇబ్బందులు
అప్పటి నుంచీ డీఈవో పూల్లో కొనసాగింపు
ఎక్కడ అవసరం ఉంటే అక్కడకు పంపుతున్న విద్యా శాఖ
ఆరేళ్లలో నాలుగుసార్లు బదిలీ
తాజాగా ఏజెన్సీ మండలాల్లో పోస్టింగ్
జడ్పీ ప్రాంగణంలో ఆందోళన
విశాఖపట్నం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి):
గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు అధికారులు అత్యుత్సాహంతో భాషోపాధ్యాయ (లాంగ్వేజ్ పండిట్లు) కేడర్ను రద్దు చేయడంతో వారంతా ఆరేళ్ల నుంచి త్రిశంకుస్వర్గంలో ఉండిపోయారు. ప్రస్తుతం మిగులు ఉపాధ్యాయులగా డీఈవో పూల్లో ఉన్న వారిని విద్యా శాఖ ఎక్కడ అవసరం ఉంటే అక్కడకు పంపిస్తోంది. ఏదైనా ఒక పాఠశాలలో టీచర్ దీర్ఘకాలిక సెలవుపై లేదా పదోన్నతిపై వెళ్లిపోతే ఆ స్థానంలో తాత్కాలికంగా పనిచేయాలని ఆదేశాలు ఇస్తోంది.
2008లో మెగా డీఎస్సీ ద్వారా తెలుగు, హిందీ, ఒరియా, ఉర్దూ, కన్నడ, తమిళం, సంస్కృత భాషల కోసం ఎంపికైన భాషోపాధ్యాయుల్లో కొందరికి తరువాత గ్రేడ్-1 పండిట్లుగా పదోన్నతి లభించింది. అయితే 2019 నవంబరులో వైసీపీ ప్రభుత్వం జీవో నంబరు 77 ద్వారా భాషాపోధ్యాయ వ్యవస్థను రద్దు చేసింది. దీంతో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పదోన్నతి లభించని 66 మంది డీఈవో పూల్లోకి వెళ్లిపోయారు. కేడర్ రద్దు చేసినప్పుడు ఆ పోస్టులో ఉన్నవారందరికీ పదోన్నతి కల్పిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవని తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలతో గడచిన ఆరేళ్లలో భాషోపాధ్యాయులు నాలుగు సార్లు బదిలీలకు గురయ్యారు. నిబంధనల మేరకు ఒక టీచర్ ఒకే స్కూలులో ఎనిమిదేళ్లు పనిచేయవచ్చు. దానికి భిన్నంగా పండిట్లను ఎప్పుడు పడితే అప్పుడు బదిలీ చేయడం పరిపాటిగా మారింది. ఇటువంటి పరిస్థితులతో విసుగుచెందిన భాషోపాధ్యాయులు తమకు న్యాయం చేయాలంటూ 2024లో కోర్టును ఆశ్రయించారు. అర్హతల మేరకు మూడు నెలల్లో పదోన్నతులు కల్పించాలని కోర్టు ఆదేశించినా ఖాళీలు లేవని విద్యా శాఖ వాయిదా వేస్తూ వచ్చింది. ఈలోగా సీనియారిటీ మేరకు భాషోపాధ్యాయులుగా తమకు కూడా పదోన్నతులు కల్పించాలని ఎస్జీటీలు కోర్టును ఆశ్రయించారు. దీంతో యథాస్థితి కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
భాషాపాధ్యాయుల ఆందోళన
భాషోపాధ్యాయుల బదిలీల కోసం వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చినా ఎవరూ ఆన్లైన్లో దరఖాస్తు చేయలేదు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో డీఈవో పూల్లో ఉన్న 66 మంది భాషోపాధ్యాయులలో 48 మందిని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెంకొత్తవీధి, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి మండలాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో పోస్టింగ్ ఇస్తామని, మిగిలిన 18 మందిని క్లస్టర్ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తామని విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు. దీనిపై శుక్రవారం జడ్పీ ప్రాంగణంలో టీచర్ల కౌన్సెలింగ్ జరుగుతున్న హాలు ముందు భాషోపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పండిట్లు మాట్లాడుతూ 66 మందిలో 50 మంది వరకూ మహిళలే ఉన్నారని, ఏజెన్సీలో మారుమూల ప్రాంతాలకు ఎలా వెళతారని ప్రశ్నించారు. తమను మైదాన ప్రాంతంలో ఏ మూలైనా యూపీ పాఠశాలలకు పంపాలని డిమాండ్ చేశారు. వారి తరపున ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు వెంకటపతిరాజు, గోపినాథ్, తదితరులు విశాఖ ఆర్జేడీ విజయభాస్కర్, విశాఖ డీఈవో ప్రేమ్కుమార్, అనకాపల్లి డీఈవో అప్పారావునాయుడుతో చర్చలు జరిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తిచేశారు.