అన్నదాత ఆనందం
ABN , Publish Date - Jun 14 , 2025 | 10:57 PM
మండలంలో రూ.2 కోట్లతో 75 సాగునీటి కాలువల్లో పూడికతీత, అభివృద్ధి పనులు చేపట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి కాలువలను నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సాగునీటి కాలువలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలో రూ.2 కోట్లతో 75 సాగునీటి కాలువల్లో పూడికతీత, అభివృద్ధి పనులు
గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం
కాలువలు పూడుకుపోయినా పట్టించుకోని వైనం
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక దృష్టి
ఈ ఖరీఫ్కు సాగునీటికి ఇబ్బందులు ఉండవని రైతుల హర్షం
మాకవరపాలెం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): మండలంలో రూ.2 కోట్లతో 75 సాగునీటి కాలువల్లో పూడికతీత, అభివృద్ధి పనులు చేపట్టడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి కాలువలను నిర్లక్ష్యం చేయడంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సాగునీటి కాలువలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనులు చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మామిడిపాలెం, పాపయ్యపాలెం, బూరుగుపాలెం, మాకవరపాలెం, గిడుతూరు, మల్లవరం సాగునీటి కాలువలు పూర్తిగా పూడుకు పోయాయి. దీని వల్ల వరి సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి హామీ పథకం ద్వారా సాగునీటి కాలువల్లో పూడికల తొలగింపు, అభివృద్ధికి చర్యలు చేపట్టింది. మండలంలో సుమారు 75 చిన్న, పెద్ద, రిజర్వాయర్ సాగునీటి కాలువలను అభివృద్ధి చేస్తున్నట్టు మండల ఏపీవో కాశీ తెలిపారు. మామిడిపాలెం రిజర్వాయర్ కింద ఉన్న సుమారు 400 ఎకరాలకు సాగునీరు అందించే సాగునీటి కాలువ పనులు గత 20 రోజులుగా చేస్తున్నారు. ఈ ఏడాది రిజర్వాయర్ నుంచి నీరు వరి సాగుకు అందుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వం ఈ కాలువను ఐదేళ్లుగా పట్టించుకోకపోవడంతో రైతులు వరిసాగును వదిలేసి సరుగుడు వేశారు. అలాగే మాకవరపాలెం మెరక కాలువ ఐదేళ్లుగా తుప్పలతో ఉండడంతో ఈ కాలువ కింద ఉన్న సుమారు 200 మంది సాగురైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ కాలువ పనులు కూడా చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్లవరం నుంచి గిడుతూరు గ్రామాల్లో ఉన్న 300 ఎకరాలకు సాగునీరు అందించే సాగునీటి కాలువలో తుప్పలు, పూడికలు తొలగించి సాగునీరు వచ్చేలా అభివృద్ధి చేశారు. మిగతా కాలువల అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఖరీఫ్ నాటికి ఈ పనులు పూర్తయితే ఈ ఏడాది సాగునీటికి ఇబ్బందులు ఉండవని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.