Share News

ఇళ్ల బిల్లులకు గ్రహణం

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:23 AM

ప్రధాన మంత్రి జన్‌మన్‌ యోజన కింద చేపట్టిన పక్కా ఇళ్లకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి. మూడు నెలల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు తీవ్వ ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల సమాచారం మేరకు జిల్లాలో 3,982 మంది లబ్ధిదారులకు రూ.25.43 కోట్లు అందాల్సి వుంది.

ఇళ్ల బిల్లులకు గ్రహణం
పెదబయలు మండలం కప్పాడలో పూర్తయిన పీఎం జన్‌మన్‌ ఇల్లు

జిల్లాలో 3,982 మందికి రూ.25.43 కోట్లు పెండింగ్‌

మూడు నెలల నుంచి నిరీక్షిస్తున్న పీఎం జన్‌మన్‌ లబ్ధిదారులు

తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

ప్రధాన మంత్రి జన్‌మన్‌ యోజన కింద చేపట్టిన పక్కా ఇళ్లకు బిల్లులు చెల్లింపులు ఆగిపోయాయి. మూడు నెలల నుంచి నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు తీవ్వ ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల సమాచారం మేరకు జిల్లాలో 3,982 మంది లబ్ధిదారులకు రూ.25.43 కోట్లు అందాల్సి వుంది.

జిల్లాలో అత్యంత వెనుకబాటుకు గురైన ఆదిమజాతి గిరిజనులకు గృహ యోగం కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జన్‌మన్‌ యోజన కింద పక్కా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద జిల్లాలోని 33,565 ఆదిమ జాతి గిరిజన కుటుంబాలకు గత ఆర్థిక సంవత్సరంలో పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. సాధారణంగా ఒక్కో పక్కా ఇంటికి ప్రభుత్వం రూ.1.8 లక్షలు మాత్రమే ఇస్తున్నది. అయితే ప్రధాన మంత్రి జన్‌మన్‌ యోజన కింద ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు కేటాయించింది. ఈ నిధులు మూడు విడతాల్లో మంజూరవుతాయి. ఇదిలావుండగా జిల్లాకు మంజూరైన 33,565 ఇళ్లల్లో వివిధ కారణాల వల్ల 9,686 ఇళ్లు నిర్మాణం ప్రారంభం కాలేదు. మిగిలిన 24,749 మంది ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టగా, వీటిలో 1,297 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. వివిధ దశల పనులు చేసిన 2,685 మందికి, నిర్మాణం పూర్తియిన 1,297 మంది.. మొత్తం 3,982 మందికి రూ.25.43 కోట్ల బిల్లులు అందాల్సి వుంది. బిల్లులను మూడు నెలల కిత్రమే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసినప్పటికీ ఇంతవరకు నిధులు జమకాలేదు. బిల్లులు ఎప్పుడు వస్తాయంటూ లబ్ధిదారులు హౌసింగ్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు లబ్ధిదారులు వాపోతున్నారు. బిల్లుల చెల్లింపులు జరిగితే తదుపరి పనులు కొనసాగిస్తామని వారు చెబుతున్నారు.

లబ్ధిదారులకు చెల్లింపులు ఇలా....

ఒక యూనిట్‌ (ఇల్లు) విలువ రూ.2.39 లక్షలు. పునాదాలు నిర్మించిన తర్వాత బిల్లులు అప్‌లోడ్‌ చేస్తే రూ.70 వేలు లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. శ్లాబ్‌స్థాయికి వచ్చిన తరువాత రూ.90 వేలు, శ్లాబ్‌ వేసిన తరువాత రూ.40 వేలు విడుదల అవుతాయి. రూ.27 వేలకు 90 రోజులపాటు ఉపాధి హామీ పని కల్పిస్తారు. మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12 వేలు మంజూరవుతాయి.

Updated Date - Jun 14 , 2025 | 01:23 AM