Share News

క్షణికావేశంలో దారుణం

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:23 AM

జీవీఎంసీ 54వ వార్డు పరిధిలోని రెడ్డికంచరపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది.

క్షణికావేశంలో దారుణం

భార్యను డంబెల్‌తో కొట్టి హతమార్చి, అనంతరం తానూ ఆత్మహత్య

అనాథలుగా ఇద్దరు పిల్లలు

కంచరపాలెం, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి):

జీవీఎంసీ 54వ వార్డు పరిధిలోని రెడ్డికంచరపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో పాటు తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కోపంతో డంబెల్‌తో దాడి చేసి హతమార్చిన భర్త...అనంతరం తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్డికంచరపాలెం వివేకానంద వీధిలో నివాస ఉంటున్న నందిగామ గోపీనాథ్‌ (42) పెయింటింగ్‌ పనులు చేసేవాడు. అతనికి భార్య వెంకటలక్ష్మి (37), కుమారుడు జశ్వంత్‌ రీతు (14), కుమార్తె లక్ష్మీప్రియ (10) ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్త వేధింపులు భరించలేక వెంకటలక్ష్మి కుమార్తెతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల తిరిగి భర్త వద్దకు వచ్చింది. అయితే వచ్చినప్పటి నుంచి భార్యను గోపీనాథ్‌ అనుమానంతో వేధిస్తుండేవాడు. ఆ వేధింపులు తట్టుకోలేక వెంకటలక్ష్మి ఈమధ్య కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని గోపీనాథ్‌ ఒత్తిడి తెచ్చేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆవేశంతో ఊగిపోతూ ఇంట్లో ఉన్న డంబెల్‌తో కొట్టి వెంకటలక్ష్మిని గోపీనాథ్‌ హతమార్చాడు. ఆ తరువాత తాను వేరొక గదిలోకి వెళ్లి గడియ పెట్టి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల మధ్య గొడవ సమయంలో అడ్డుకోవడానికి ఇద్దరు పిల్లలు యత్నించగా వారిని గోపీనాథ్‌ వేరొక గదిలో పెట్టి తలుపులు వేసినట్టు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. భర్త వేధింపులపై వెంకటలక్ష్మి కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని, గోపీనాథ్‌పై చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదని మృతుల కుటుంబ సభ్యులు వాపోయారు.


వేటకు వేళాయె

నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలోకి బోట్లు

హార్బర్‌ కేంద్రంగా 650 మరబోట్లు

రొయ్యల కంటే చేపలతోనే గిట్టుబాటు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సముద్రంలో చేపల వేట శనివారం అర్ధరాత్రి నుంచి మొదలుకానుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన రెండు నెలల నిషేధం ముగియనుండడంతో మత్స్యకారులు వేటకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హార్బర్‌ను కేంద్రంగా చేసుకొని సుమారు 650 మరబోట్లు ఉండగా, వాటిలో సగం కంటే తక్కువే వేటకు వెళ్లనున్నాయి.

డీజిల్‌, ఐస్‌, బోట్ల విడి భాగాల ధరలు బాగా పెరగడం, గిట్టుబాటు అయ్యేలా వేట లేకపోవడం వల్ల చాలామంది బోట్లను జెట్టీలకే పరిమితం చేస్తున్నారు. ఇంతకుముందు కొందరు మత్స్యకారులు రెండు నుంచి నాలుగు మరబోట్లు సమకూర్చుకొని, వేటకు కూలీలను పంపించేవారు. హార్బర్‌కు తిరిగి వచ్చాక దొరికిన దాంట్లో కొంత పర్సంటేజీతో పాటు చిల్లర చేపలన్నీ వారికి ఇచ్చేవారు. ప్రతి బోటుకు డ్రైవర్‌తో సహా పది మంది వరకు కూలీలు ఉండడంతో వాటాలు పంచేసరికి యజమానికి పెట్టుబడికి తగిన ప్రతిఫలం రావడం లేదు. ఒక వాయేజ్‌ అంటే రెండు వారాలు సముద్రంలో వేట సాగించడానికి డీజిల్‌, ఐస్‌, ఆహారం కోసం సుమారు రూ.4 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. అందరికీ వాటాలు ఇచ్చాక పెట్టుబడి వస్తే చాలనే భావన కలుగుతోంది. దాంతో కొందరు వేటకు దూరంగా ఉంటున్నారు.

తొలి మూడు నెలలు అంటే సెప్టెంబరు వరకూ ఎక్కువగా రొయ్యలే పడతాయి. వీటికి ఇంతకు ముందులా డిమాండ్‌ లేదు. ఉభయ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో వనామీ రొయ్యలను సాగు చేయడం వల్ల అవి తక్కువ రేటుకే లభిస్తున్నాయి. సముద్రపు రొయ్యలకు ఎగుమతిదారులు ఎక్కువ రేటు ఇవ్వడం లేదు. సెప్టెంబరు నెలాఖరు నుంచి చేపలు బాగా దొరుకుతాయి. వాటికి మంచి రేటు, డిమాండ్‌ కూడా ఉంటోంది. అందుకని చాలామంది బోట్లకు హుక్కులు వేసుకొని చేపల వేటకు వెళుతున్నారు. చాలామంది ఓనర్లు కూలీలతో బోట్లు తిప్పడం లేదు. ఓనర్‌ కమ్‌ డ్రైవర్‌గా ఉండేవారు వేటకు వెళితేనే గిట్టుబాటు అవుతోంది. వారే ఇప్పుడు ముందుగా వేటకు వెళుతున్నారు.

Updated Date - Jun 14 , 2025 | 01:24 AM