Share News

పక్కాగా ఫీవర్‌ సర్వే

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:11 AM

గ్రామాల్లో పక్కాగా ఫీవర్‌ సర్వే చేయాలని, జ్వరాలపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో జమాల్‌బాషా ఆదేశించారు. మండలంలోని మారుమూల పినకోట పీహెచ్‌సీని శనివారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.

పక్కాగా ఫీవర్‌ సర్వే
పినకోట పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా

- వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

- డీఎంహెచ్‌వో జమాల్‌బాషా ఆదేశం

- పినకోట పీహెచ్‌సీ తనిఖీ

అనంతగిరి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పక్కాగా ఫీవర్‌ సర్వే చేయాలని, జ్వరాలపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో జమాల్‌బాషా ఆదేశించారు. మండలంలోని మారుమూల పినకోట పీహెచ్‌సీని శనివారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల నిల్వలను పరిశీలించారు. మలేరియా కేసులు నమోదైతే గ్రామమంతా మలేరియా పరీక్షలు నిర్వహించాలని, ఫాగింగ్‌, స్ర్పేయింగ్‌, పిచికారీ చేయించాలని ఆదేశించారు. అనంతరం పినకోట గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలను సందర్శించారు. అలాగే చింతపాక, జీనబాడు గ్రామాలను సందర్శించి అక్కడి ఆరోగ్య పరిస్థితిపై గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైద్యాధికారి డి.రూప్‌చంద్‌, ఎంపీహెచ్‌ఈవో గంగరాజు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రవిశర్మ, ఏఎంవో ఏజె.సత్యనారాయణ, సబ్‌ యూనిట్‌ అధికారి బాబురావు, ఎల్‌టీ శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

జీతాలు పెంచాలని సీహెచ్‌డబ్ల్యూల వినతి

పినకోట పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో జమాల్‌బాషాకు పినకోట పీహెచ్‌సీ పరిధిలోని 15 మంది సీహెచ్‌డబ్ల్యూలు వినతిపత్రం అందజేశారు. ఆశ కార్యకర్తలతో సమానంగా విధులు నిర్వహిస్తున్నామని, కానీ తమకు రూ.4 వేలు జీతాలు ఇస్తున్నారని తెలిపారు. తమకు జీతాలు పెంచాలని కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆయన చెప్పారు.

Updated Date - Jun 15 , 2025 | 12:12 AM