CM Chandrababu: ఆర్థిక శక్తిగా విశాఖ
ABN , Publish Date - Jun 07 , 2025 | 02:51 AM
వచ్చే ఏడేళ్లలో విశాఖపట్నాన్ని ప్రధాన ఆర్థిక శక్తిగా మలిచే ప్రతిష్ఠాత్మక రోడ్మ్యా్పను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఉత్తరాంధ్రలోని ఎనిమిది జిల్లాలను కలిపి ‘విశాఖ ఎకనామిక్ రీజియన్’గా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

8 జిల్లాలతో ఎకనామిక్ రీజియన్: సీఎం
2032 నాటికి 120 బిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలి
ఆంధ్రా వృద్ధి ఇంజన్గా అభివృద్ధి చేయాలి
24 లక్షల ఉద్యోగాల కల్పన టార్గెట్
6 పోర్టులు, 7 ఉత్పాదక కేంద్రాల నిర్మాణం
రాష్ట్ర విజన్ సాకారానికి సహకరించండి
నీతి ఆయోగ్ అధికారులకు బాబు వినతి
అమరావతి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడేళ్లలో విశాఖపట్నాన్ని ప్రధాన ఆర్థిక శక్తిగా మలిచే ప్రతిష్ఠాత్మక రోడ్మ్యా్పను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఉత్తరాంధ్రలోని ఎనిమిది జిల్లాలను కలిపి ‘విశాఖ ఎకనామిక్ రీజియన్’గా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ వృద్ధి ఇంజన్గా తీర్చిదిద్దాలన్నారు. 2032 నాటికి ఈ రీజియన్ను 120 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సూచించారు. రాబోయే ఏడేళ్లలో విశాఖను మరో ముంబై స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో ఆయన నీతి ఆయోగ్ అధికారులతో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఐఎ్సఈజీ ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర విజన్ సాకారానికి సహకరించాలని నీతి ఆయోగ్ను చంద్రబాబు కోరారు. విశాఖ ఆర్థిక రీజియన్లో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం కలిపి.. మొత్తం 8 జిల్లాలుంటాయని చెప్పారు. ఈ ప్రాంతంలో వివిధ రకాల ప్రాజెక్టుల కోసం లక్ష ఎకరాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ‘ఈ ఎకనమిక్ రీజియన్ విస్తీర్ణం 36,000 చదరపు కిలోమీటర్లు. జనాభా 1.55 కోట్లు. ఈ ప్రాంత ప్రస్తుత జీడీపీ 49 బిలియన్ డాలర్లు. 2032 నాటికి 120 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మలచాలి. ఏడేళ్లలో 24 లక్షల ఉద్యోగాలు సృష్టించే సామర్థ్యం ఈ రీజియన్కి ఉంది. రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి చాలా కీలకం’ అని వివరించారు ఈ రీజియన్లో 6 పోర్టులు, 7 ఉత్పాదక కేంద్రాలు, 17 ప్రధాన వ్యవసాయ జోన్లు, 6 సేవా హబ్స్, 12 టూరిజం హబ్స్ నిర్మాణాన్ని సీఎం ప్రతిపాదించారు.
పోర్టులు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణాభివృద్ధి, ఇన్ఫ్రా విభాగాల్లో ప్రణాళికల గురించి నీతి ఆయోగ్ అధికారులకు వివరించారు. ఏడేళ్లలో ఈ ప్రణాళికలన్నీ కార్యరూపం దాలిస్తే.. విశాఖ రీజియన్లో 7.5 లక్షల ఇళ్లు, 10,000 హోటల్ గదులు, 20 ఇన్నొవేషన్ కేంద్రాలు, 10 కళాశాలలు, 7,000 ఆస్పత్రి పడకలు, 20,000 హెక్టార్లలో పారిశ్రామికాభివృద్ధి, 80 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలం, 60 మిలియన్ చదరపు అడుగుల గిడ్డంగులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పరిశ్రమగా పర్యాటకం..పర్యాటక రంగాన్ని పరిశ్రమగా పరిగణిస్తామని, తమ కొత్త విధానాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాయని సీఎం వెల్లడించారు. మూలపేట-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ మధ్య బీచ్ రోడ్డులు అభివృద్ధి చేస్తామన్నారు. ఈ రోడ్లను జాతీయ రహదారులకు అనుసంధానిస్తామని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యువతకు నిరంతరం నైపుణ్య శిక్షణ ఇస్తామని తెలిపారు. 20 లక్షల మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
ఉక్కు హబ్గా విశాఖ..
దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న 3 అతిపెద్ద ఉక్కు కంపెనీలతో కలిసి విశాఖను ఉక్కు హబ్గా అభివృద్ధి చేయడంపై సమీక్షలో చర్చించారు. పెట్రోకెమికల్స్, గ్యాస్ గ్రిడ్, పోర్టుల అభివృద్ధి, పెట్రోకెమికల్-మెడికల్ టెక్, షిప్ బిల్డింగ్, రక్షణ, ఎలక్ర్టానిక్స్, క్లీన్ టెక్ రంగాలపై దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఐటీ రంగంలో 4-5 లక్షల ఉద్యోగాలు సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నామని.. డేటా సెంటర్లు, స్టార్ట్పలు, ఇన్నొవేషన్ కేంద్రాల ఏర్పాటుతో ఈ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఆకాంక్షించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 4 రైల్వే ప్రాజెక్టులతో పాటు 2032 నాటికి కొత్తగా మరో 7 రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఉత్పాదక కేంద్రాలు, పోర్టులను అనుసంధానిస్తూ కొత్తగా 9 కొత్త రోడ్డు ప్రాజెక్టులను ప్రారంభించే ఆలోచనలో ఉంది. 2028-30లోగా 77 కిలోమీటర్ల పరిధితో విశాఖ మెట్రో ప్రాజెక్టు పూర్తిచేయడంపై సమావేశంలో చర్చించారు.
క్లీన్ ఎనర్జీలో రూ.5.78 లక్షల కోట్ల పెట్టుబడులు
విద్యుత్ సంస్కరణల్లో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు. ఇప్పటికే క్లీన్ ఎనర్జీ రంగంలో రూ.5.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. విద్యుత్ రంగ అభివృద్ధి ప్రణాళికలపై రాష్ట్ర ప్రభుత్వానికి, నీతి ఆయోగ్, ఐఎ్సఈజీ ఫౌండేషన్ మధ్య సీఎం సమక్షంలో ఈ సందర్భంగా అవగాహన ఒప్పందం కుదిరింది.