Chilakaluripeta: విడదల రజిని ముఖ్య అనుచరుడు అరెస్ట్
ABN , Publish Date - May 11 , 2025 | 05:27 AM
మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో రజిని పోలీసులకు అడ్డుపడుతూ వాగ్వాదానికి దిగారు.

మాజీ మంత్రి కారులో దాక్కున్న శ్రీకాంత్రెడ్డి
కారు తలుపులకు అడ్డంగా నిలబడిన రజిని
ఆగ్రహంతో ఊగిపోతూ పోలీసులతో వాగ్వాదం
బలవంతంగా తలుపులు తెరిచి అదుపులోకి...
చిలకలూరిపేట/నాదెండ్ల మే 10(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి విడదల రజిని ప్రధాన అనుచరుడు, వైసీపీకి చెందిన మానుకొండ శ్రీకాంత్రెడ్డి(35) ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న అతడిని అదుపులోకి తీసుకునే సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. రెండు కుటుంబాల వారిని పరామర్శించేందుకు రజిని పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి కారులో వెళ్లారు. ఆ కారులో శ్రీకాంత్ రెడ్డి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బనాయుడు పోలీసు సిబ్బందితో కలిసి జంగాలపల్లెలో రజిని కారును చుట్టుముట్టారు. లోపల దాక్కుని కూర్చున్న శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సీఐ కారు తలుపులు తీయబోగా రజిని అడ్డుకున్నారు. ‘ఏంటిది సీఐ గారు’ అని ఆగ్రహంతో ఊగిపోతూ పెద్దగా కేకలు వేశారు. కారుకు అడ్డంగా నిలబడి తలుపులు తీయనీయలేదు. రజిని పోలీసులతో చాలాసేపు వాగ్వాదానికి దిగారు. విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. రజిని కేకలు వేస్తూ అడ్డుకుంటూ ఉండగానే పోలీసులు బలవంతంగా కారు తలుపులు తెరిచి శ్రీకాంత్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు ఇప్పిస్తామని చిలకలూరిపేటకు చెందిన ఎం.రత్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర రూ.24లక్షలు వసూలు చేసిన చీటింగ్ కేసు విషయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. శ్రీకాంత్రెడ్డిపై మరికొన్ని కేసులూ ఉన్నట్టు తెలిసింది.