Water Supply Ap: తుంగభద్ర నీటి నిల్వ 80 టీఎంసీలే
ABN , Publish Date - Jun 15 , 2025 | 05:05 AM
దెబ్బతిన్న తుంగభద్ర ప్రాజెక్టు 32 క్రస్ట్గేట్లను మార్చాల్సి ఉన్న నేపథ్యంలో 2025-26 నీటి సంవత్సరంలో డ్యాంలో నీటి నిల్వను 80 టీఎంసీలకు పరిమితం చేయాలని బోర్డు అధికారులు నిర్ణయించారు.

ఖరీఫ్ పంటకు, తాగునీటికి మాత్రమే అవకాశం
క్రస్ట్గేట్లు దెబ్బతిన్న నేపథ్యంలో బోర్డు నిర్ణయం
రబీ పంటకు సాగు నీరు ఉండకపోవచ్చు!
గేట్లను వచ్చే జూన్ నాటికి మార్చాలని లక్ష్యం
రూ.58 కోట్లతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి
కర్నూలు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): దెబ్బతిన్న తుంగభద్ర ప్రాజెక్టు 32 క్రస్ట్గేట్లను మార్చాల్సి ఉన్న నేపథ్యంలో 2025-26 నీటి సంవత్సరంలో డ్యాంలో నీటి నిల్వను 80 టీఎంసీలకు పరిమితం చేయాలని బోర్డు అధికారులు నిర్ణయించారు. డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం(105.85 టీఎంసీలు)ల్లో 25 టీఎంసీలు తగ్గనుండడం, డిసెంబరు నాటికి స్పిల్లెవల్ 1,613 అడుగుల దిగువకు నీటి నిల్వ పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఖరీఫ్ పంట సాగుకు, తాగునీటి అవసరాలకు మాత్రమే నీరు ఇవ్వాలని ఇటీవల జరిగిన టీబీపీ బోర్డు అత్యవసర సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రబీకి నీరు ఉండకపోవచ్చని, ఆయకట్టు రైతులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ఈ ఏడాది డ్యాంలో 80 టీఎంసీలు నిల్వ చేసి.. ఆపై వచ్చే వరదను కాలువలకు, దిగువ నదికి విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు కూడా సమ్మతించాయి. రబీకి సాగునీరు ఉండకపోవచ్చని, ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచించినట్లు తెలుస్తుంది.
అన్ని గేట్లు మార్చాల్సిందే..
తుంగభద్ర క్రస్ట్గేట్లు అన్నింటినీ మార్చాల్సిందేనని డ్యాంను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన కేఎస్ఎన్డీటీ సర్వీసెస్ సంస్థ టీబీపీ బోర్డుకు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీ జలవనరుల శాఖ సలహాదారుడు కన్నయ్యనాయుడు ఏప్రిల్ 8, 9వ తేదీల్లో డ్యాంను సందర్శించి.. ప్రతి గేటును తనిఖీ చేశారు. ఏకే బజాజ్ కమిటీ, కేఎస్ఎన్డీటీ నివేదికలు పరిశీలించారు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా ఈ నీటి సంవత్సరంలో 80 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయాలని ఆయన సూచించారు. నిపుణులు కమిటీ, అధ్యయన సంస్థ నివేదిక, కన్నయ్యనాయుడు సూచనల నేపథ్యంలో తుంగభద్ర ప్రాజెక్టు బోర్డు పై మేరకు నిర్ణయం తీసుకుంది. క్రస్ట్ గేట్ల మార్పునకు అధికారులు రూ.58 కోట్లతో ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. అహ్మదాబాద్కు చెందిన హార్డ్వేర్ టూల్స్ సంస్థ పనులను దక్కించుకుంది. వచ్చే ఏడాది జూన్ ఆఖరులోగా గేట్లు అమర్చే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, గేట్ల మార్పు పనులు దృష్ట్యా డ్యాం నీటి నిల్వ సామర్థ్యాన్ని 105.85 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు తగ్గించారు. దీంతో 2025-26 నీటి సంవత్సరంలో 120 టీఎంసీల వరద డ్యాంలో చేరే అవకాశం ఉందని టీబీపీ బోర్డు వాటర్ రివ్యూ కమిటీ అంచనా వేసింది. కేడబ్ల్యూడీటీ-1 అవార్డు ప్రకారం కర్ణాటక వాటా జలాలు 138.990 టీఎంసీలకు గానూ 78.674, ఏపీ వాటా 66.500 టీఎంసీలకు గానూ 37.642, తెలంగాణ వాటా 6.510 టీఎంసీలకు గాను 3.685 కేటాయించారు. ఏపీ కోటాలో కర్నూలు జిల్లా టీబీపీ ఎల్ఎల్సీ కాలువకు 24 టీఎంసీలకు గానూ 13.585, కేసీ కాలువకు 10 టీఎంసీలకు గానూ 5.660 టీఎంసీలు కేటాయించారు.