Chandrababu: 23 నుంచి తొలి అడుగు
ABN , Publish Date - Jun 14 , 2025 | 03:53 AM
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

కూటమి ఏడాది సుపరిపాలనపై ఇంటింటి ప్రచారం.. ప్రజల్లోకి వెళ్లి అమలు చేసిన పథకాలను వివరించండి
ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి
ఏడాదిలోపే ముఖ్యమైన పథకాలన్నీ అమలు: సీఎం
టీడీపీ నేతలు, కార్యకర్తలతో టెలీకాన్ఫరెన్స్
అమరావతి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో ‘తొలి అడుగు’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 23నుంచి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి కార్యకర్తలతో శుక్రవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాదిలో ప్రభుత్వ కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలను ఇంటింటికీ తిరిగి వివరించాలని సూచించారు. ఇందులో లీడర్ నుంచి కేడర్ వరకూ ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రచారం చేసే విషయంలో పోటీ పడాలని నిర్దేశించారు. ‘మొదటి ఏడాది ఏం చేశామో చెప్పడంతో పాటు ప్రత్యర్థి పార్టీలు మనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ‘తల్లికి వందనం’ అమలు చేశాం. ఎంతమంది పిల్లలు ఉన్నా పథకం వర్తింపజేస్తున్నాం. 67.27లక్షల మంది విద్యార్థులకు రూ.10వేల కోట్లు విడుదల చేశాం. తల్లుల ఖాతాలో రూ.13వేలు, పాఠశాల అభివృద్ధికి రూ.2వేలు కేటాయిస్తున్నాం. గత ప్రభుత్వం 42లక్షల మందికే ఇస్తే వారికంటే ఘనంగా మన ప్రభుత్వం 25లక్షల మందికి అదనంగా పథకాన్ని అమలు చేస్తోంది. వారు చేసిన ఖర్చు రూ.5,540 కోట్లు అయితే మన ప్రభుత్వం చేసే ఖర్చు రూ.8,747కోట్లు. ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను కలుపుకుంటే ఇది రూ.10వేల కోట్లకు చేరుతుంది. తల్లికి వందనం నిధుల విడుదలపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక పథకానికి ఇన్ని వేల కోట్లు ఒకేసారి విడుదల చేయడం ఒక చరిత్ర. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముఖ్యమైన పథకాలన్నింటినీ ఏడాదిలోపే అమలు చేస్తున్నాం.
ఇంత చేస్తున్నా బుద్ధి, జ్ఞానం లేకుండా వైసీపీ వారు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎన్నికల ముందు సూపర్-6, మేనిఫెస్టో, బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. వాటిని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తోంది. ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పండి. పార్టీ సంస్థాగత కమిటీలు పూర్తి చేయాలి. పార్టీ కోసం కష్టపడే వారికి అవకాశం కల్పించాలి. జూలై నుంచి కార్యకర్తలు, నేతలకు నాయకత్వ శిక్షణ శిబిరాలు నిర్వహిస్తాం. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దుతాం. విశాఖపట్నంలో 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని 5లక్షల మందితో నిర్వహిస్తున్నాం. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా 2కోట్ల మందిని యోగాలో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని చంద్రబాబు అన్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పలువురు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.