TTD EO Shyamala Rao: తిరుమల కొండపై ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Jun 13 , 2025 | 03:54 AM
తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేందుకు అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితం చేయనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

అలిపిరిలో చెక్ పాయింట్ అభివృద్ధికి ప్రణాళికలు: టీటీడీ ఈవో
తిరుమల, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేందుకు అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితం చేయనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తిరుమలలో ప్రైవేట్ వాహనదారులు అధిక మొత్తంలో భక్తుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తిరుపతి-తిరుమల మధ్య తిరిగే బస్సులు బస్టాండుకే పరిమితం కాకుండా తిరుమలలోని ముఖ్య ప్రాంతాలకూ నడపాలని ఆర్టీసీ ఆధికారులను కోరామన్నారు. ఈ సర్వీసును ఉచితంగా ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారని తెలిపారు. దాదాపు 150 బస్సులు తొలిదశలో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కాగా, దేశవ్యాప్తంగా టీటీడీకి చెందిన 61 ఆలయాలు, ఆస్తులు ఉన్నాయని, వాటి నిర్వహణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి అధికారులను నియమిస్తామన్నారు. టీటీడీలోని 21 మంది అన్యమత ఉద్యోగులకు ఇప్పటికే వీఆర్ఎస్ ఆప్షన్ ఇచ్చామని, ఒకవేళ వారు దానికి అంగీకరించకుంటే కోర్టుకు నివేదిస్తామన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు. అలిపిరిలో చెక్ పాయింట్ అభివృద్ధిలో భాగంగా జీఎంఆర్ సంస్థకు చెందిన ఓ బృందం పరిశీలన చేసిందన్నారు. ఆధునాతన కెమెరాలు, స్కానర్లు అందుబాటులోకి తీసుకువచ్చి తనిఖీల నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తామన్నారు. టీటీడీ ఈవోగా నియమితులై ఏడాది కావడంపై స్పందిస్తూ ‘ఈ బాధ్యత మంచి అనుభూతి కలిగించింది. శ్రీవారు, సీఎం ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మంచి నిర్ణయాలు తీసుకుని అమలుచేస్తున్నా. భవిష్యత్తులో ఇంకా మెరుగైన సేవలు అందిస్తాం’ అని శ్యామలరావు తెలిపారు.