online scam: డాక్టర్కే మోసం
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:19 AM
cybercriminals arrested డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నేరస్థులు ఒకటో పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద వెల్లడించారు.

ముగ్గురు సైబర్ నేరస్థుల అరెస్టు
రూ.6 లక్షల నగదు స్వాధీనం
శ్రీకాకుళం క్రైం, జూన్ 14(ఆంధ్రజ్యోతి): డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నేరస్థులు ఒకటో పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ.6లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద వెల్లడించారు. ‘జిల్లాలో తొలిసారిగా డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వైద్యురాలిని మోసగించి సుమారు రూ.16 లక్షలు కాజేశారు. జెమ్స్ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్న డాక్టర్ రేవతికి గత నెల 14న ఉదయం 10 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్కాల్ వచ్చింది. బెంగుళూరు అశోక్నగర్ పోలీస్స్టేషన్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి సైబర్ నేరగాళ్లు రేవతిని బ్లాక్మెయిల్ చేశారు. హ్యూమన్ ట్రాకింగ్ చేయించే కేసులో మీ పేరు ఉందంటూ.. సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తున్నామని బెదిరించారు. కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదించేందుకు కొంత డబ్బును డిపాజిట్ చేయాలని, అంతవరకు మీ అరెస్టు ఆగుతుందని చెప్పారు. దీంతో భయపడిన వైద్యురాలు రేవతి.. వారు చెప్పిన పలు అకౌంట్లకు రూ.16లక్షలు ఆన్లైన్లో జమ చేశారు. కొన్ని రోజుల తర్వాత మోసపోయానని గ్రహించి.. ఆమె ఈ వ్యవహారంపై శ్రీకాకుళం వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు సైబర్ నేరగాళ్లను విశాఖపట్నం రైల్వేస్టేషన్లో శనివారం అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిలు మైసూర్కు చెందిన రుమన్ షరీఫ్, కాలికట్కు చెందిన నౌఫాలా షరీన్, కేరళకు చెందిన నిజాముద్దీన్చక్లాలుగా గుర్తించారు. ఆ ముగ్గురినీ విచారించారు. వారి వద్ద నుంచి సుమారు రూ.6లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామ’ని డీఎస్పీ తెలిపారు. విద్యావంతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు అధికంగా సైబర్ నేరగాళ్ల మాయలో పడి మోసపోతున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కేసును చేధించడంలో కృషి చేసిన శ్రీకాకుళం రూరల్ సీఐ కె.పైడిపునాయుడు, ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ, ఎస్ఐ రాజేష్, కానిస్టేబుల్ ఈశ్వరరావు, రమణ, ధనలక్ష్మీని డీఎస్పీ అభినందించారు.