Share News

అది ప్రమాదమేనంట!

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:14 AM

Kurma incident accident హిరమండలం మండలం అక్రాపల్లి పంచాయతీ కూర్మ గ్రామంలోని నందగోకులం గోశాల ట్రస్టు ప్రార్థనా మందిరం కాలిపోవడానికి విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి. అది అగ్నిప్రమాదమేనని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

అది ప్రమాదమేనంట!
కాలి బూడిదైన ప్రార్థనా మందిరం (ఫైల్‌)

  • కూర్మ ఘటనపై పోలీసుల నిర్ధారణ

  • మందిరం దగ్ధంపై స్వాముల్లో అనుమానం

  • ఉద్దేశపూర్వకంగానే చేశారంటూ ఆరోపణ

  • హిరమండలం/కొత్తూరు, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): హిరమండలం మండలం అక్రాపల్లి పంచాయతీ కూర్మ గ్రామంలోని నందగోకులం గోశాల ట్రస్టు ప్రార్థనా మందిరం కాలిపోవడానికి విభిన్న కారణాలు వినిపిస్తున్నాయి. అది అగ్నిప్రమాదమేనని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు. మంగళవారం రాత్రి కూర్మ గ్రామంలోని ప్రార్థనా మందిరం అగ్నికి ఆహుతైంది. మూత్రవిసర్జనకు బయటకు వచ్చిన శ్రీకాంత్‌ కేశవదాస్‌ ఆ మంటలను చూసి కేకలు వేయగా.. పరిసరాల్లో నివాసం ఉంటున్న వారు వచ్చేలోపు ప్రార్థనా మందిరం కాలిబూడిదైంది. మందిరంలో దీపాల వల్ల అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఇందుకు ఒడిగట్టారని అక్కడ నివాసం ఉంటున్న స్వాములు ఆరోపిస్తున్నారు.

  • ప్రాచీన భారత జీవన విధానాన్ని పాటించడం కోసం 2019లో నంద గోకులం గోశాల ట్రస్టు పేరుతో కూర్మ గ్రామంలో 60 ఎకరాలను ప్రభుత్వ ధరకు కొనుగోలు చేశారు. అప్పటి నుంచీ పర్ణశాలలు, గోశాల, వేదపాఠశాలను, బ్రహ్మచారి ఆశ్రమాన్ని అభివృద్ధి చేశారు. 45 మంది వరకు స్వాములు నివాసం ఉంటున్నారు. ప్రాచీన జీవన విధానంతోపాటు సనాతన ధర్మం పరిరక్షణ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఆశ్రమ అభివృద్ధికి భక్తివికాశ్‌ స్వామీజీ ప్రత్యేక కృషి చేశారు. ఆయన తర్వాత త్రిభంగానంద్‌దాస్‌ వ్యవహారాలు చూస్తారు. ఇక్కడి ప్రార్థనా మందిరంలో నిత్యం 300 మంది వేదపాఠశాలల విద్యార్థులు భగవద్గీత శ్లోకాలు పఠిస్తారు. ఆదివారం ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. నాలుగేళ్ల కిందట ఆశ్రమ ఆవరణ గడ్డికుప్ప దగ్ధమైంది. ఏడాది కిందట ప్రార్థనా మందిరంలో హుండీ చోరీకి గురైంది. తాజాగా మంగళవారం ప్రార్థనా మందిరం దగ్ధమవడంతో స్వాములు ఆందోళన చెందుతున్నారు.

  • సనాతన ధర్మాన్ని కాపాడాలి

  • ‘ప్రార్థనా మందిరంలో వేద పాఠశాల విద్యార్థులు నిత్యం శోకాలు, భగవద్గీత పఠనం చేస్తుంటారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా అధిక మంది ప్రజలు కూడా వస్తుండడంతో ఈ ఆశ్రమానికి ఆదరణ పెరుగుతోంది. గిట్టని వ్యక్తులు ఉద్దేశ పూర్వకంగా ఘటనకు పాల్పడి ఉంటార’ని త్రిభంగానంద్‌దాస్‌, నరోత్తమ దాస్‌, లక్ష్మిహరిదాస్‌ తదితర స్వాములు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కలుగజేసుకుని సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుతున్నారు.

  • అగ్ని ప్రమాద ఘటనలో దురుద్దేశం లేదు: ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • శ్రీకాకుళం క్రైం, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ‘ఆధ్యాత్మిక కేంద్రం శ్రీకూర్మ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఎటువంటి దురుద్దేశం లేదు. ఈఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామ’ని ఎస్‌పి కె.వి.మహేశ్వరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘అగ్ని ప్రమాద ఘటనలో వ్యక్తిగతంగా, అల్లరిమూకల ప్రమేయం లేదు. కూర్మ గ్రామ సభ్యులు ప్రతిరోజూ దీపాలు వెలిగిస్తారు. పూజ చేసిన అనంతరం ఆ దీపాలు ఆర్పివేసి వెళ్లిపోతారు. కాగా.. ఏదైనా దీపం పొరపాటున పూర్తిగా ఆగకపోయి ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రస్తుతానికి భావించాం. ఈ ఘటనపై ఇప్పటికే ప్రమాద స్థలంలో భౌతిక ఆధారాలు సేకరించి విజయవాడ ఫోరెనిక్స్‌ ల్యాబ్‌కు పరీక్షలు నిమిత్తం పంపించాం. సాంకేతిక ఆధారాలు బట్టి అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామ’ని ఎస్పీ తెలిపారు. అవాస్తవాలు, వదంతులు ఎవరూ నమ్మవద్దని సూచించారు. అవాస్తవాలు ప్రచార చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

  • ‘కూర్మ’ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌ ఆరా

  • అమరావతి, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): ఆధునిక హంగులు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేలా తీర్చిదిద్దుకున్న కూర్మ గ్రామం అగ్నికి ఆహుతి కావడం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం సమీపంలోని కూర్మ గ్రామంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై ఆయన ఆరా తీశారు. ఈ సంఘటనపై పోలీసులు లోతుగా విచారణ చేయాలని సంబంధిత యంత్రాంగానికి సూచించినట్టు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలన్నారు. కూర్మగ్రామంలో ప్రస్తుత పరిస్థితులపై జిల్లా అధికారులతో మాట్లాడి, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - Jun 15 , 2025 | 12:14 AM