రక్తదానంతో ప్రాణదానం: డీఎంహెచ్వో
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:04 AM
మనిషి ప్రాణానికి రక్తం ఎంతో అవసరమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.అనిత అన్నారు. రక్తదానంతో ప్రాణదాతలు కావాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు.

శ్రీకాకుళం రిమ్స్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): మనిషి ప్రాణానికి రక్తం ఎంతో అవసరమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.అనిత అన్నారు. రక్తదానంతో ప్రాణదాతలు కావాలని ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రిమ్స్ కళాశాలలో శనివారం అవగాహనా ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మనషి శరీరంలో సుమారు 6 లీటర్ల రక్తం ఉంటుందని, ఇది నిరంతరం శరీరంలోని అన్ని భాగాలకు చేరుతుందన్నారు. రక్త కణాల వయసు 120 రోజులు మాత్రమేనని... రక్త కణాలు నశించిన తరువాత కొత్తవి ఎముక మజ్జ నుంచి తయారవుతాయని తెలిపారు. రక్తదానంతో ఎటువంటి నష్టం లేదని వివరించారు. పెద్ద ప్రమాదాలు, తలసీమియా, సికిల్సెల్ అనీమియా వంటి కేసుల్లో రక్తం అందించడం వల్ల ప్రాణాలు నిలుస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్, ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ డి.పార్వతి, పరిపాలనాధికారి బి.రాజశేఖర్, బ్లడ్ బ్యాంక్ వైద్యురాలు డాక్టర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.
ఆదుకునే అవకాశం
ఇచ్ఛాపురం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని నియోజకవర్గ తెలుగు యువత , జేసీఐ అధ్యక్షుడు కాళ్ల జయదేవ్ యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో జేసీఐ ఆద్వర్యంలో శ్రీకాకుళం రిమ్స్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పాతిర్ల దేవేంద్రరెడ్డి దీన్ని ప్రారంభించారు. 52మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఇప్పటి వరకు 191సార్లు రక్తదానం చేసిన బొడ్డేపల్లి శ్రీనువాస్ను ఘనంగా సత్కరించారు. రక్తదాతలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కె .జయదేవ్, సెక్రటరీ డాక్టర్ మోహన్, ప్రాజెక్ట్ చైర్మన్ డాక్టర్ వెచ్చా సంతోష్, జోన్ అధికారి తంగుడు షణ్ముఖ, డాక్టర్ మట్టా శ్రీనువాస్, వెచ్చా రాము, వాసవి, పవన్, మల్లేష్, రాజ్కమల్, సంతోష్సాహు తదితరులు పాల్గొన్నారు.