ఒకేరోజు రూ.25కోట్ల పనులు
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:16 AM
₹25 crore projects development works కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో భాగంగా మరో అడుగు ముందుకేసింది. టెక్కలి నియోజకవర్గాన్ని ఐదేళ్లలో అభివృద్ధి చేస్తానని మంత్రి అచ్చెన్నాయడు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతున్నారు. హామీల అమలులో భాగంగా ఆదివారం టెక్కలి, రావివలసల్లో రూ.25కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

డిప్యూటీ సీఎం పవన్ హామీలకు పచ్చజెండా
నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి అచ్చెన్న
టెక్కలి, జూన్ 14(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఏడాది సుపరిపాలనలో భాగంగా మరో అడుగు ముందుకేసింది. టెక్కలి నియోజకవర్గాన్ని ఐదేళ్లలో అభివృద్ధి చేస్తానని మంత్రి అచ్చెన్నాయడు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా చర్యలు చేపడుతున్నారు. హామీల అమలులో భాగంగా ఆదివారం టెక్కలి, రావివలసల్లో రూ.25కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. టెక్కలిలోని పట్టుమహాదేవి కోనేరుగట్టు అభివృద్ధికి సుమారు రూ.13కోట్లతో పనులు చేపట్టనున్నారు. అలాగే రూ.4 కోట్ల ఉపాధి నిధులు, రూ.కోటి మండల పరిషత్ నిధులు, రూ.2కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్తోపాటు వివిధ సంస్థల సీఎస్ఆర్ నిధులతో పనులు చేపట్టేందుకు ఇంజనీరింగ్ అధికారులు టెండర్లకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు గత నెల 22న ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ రావివలస గ్రామస్థులతో ‘మన ఊరు.. మాటామంతీ’లో భాగంగా ఇచ్చిన హామీలను రూ.12 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. వీటిలో రూ.3.50కోట్ల ఉపాధి నిధులతో ప్రసిద్ధ శైవక్షేత్రం రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయానికి రోడ్లు, రిటర్నింగ్ వాల్స్, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే చిన్ననారాయణపురానికి రూ.3.50కోట్లతో సీసీ రోడ్లు, కల్వర్టులు, కాలువల నిర్మాణం, దామోదరపురం గ్రామానికి రూ.1.50కోట్లతో సీసీ రోడ్లు, కాలువలు, శ్మశానవాటికకు రహదారి నిర్మించనున్నారు. రావివలసలోని రెండు శ్మశాన వాటికలకు రూ.1.40 కోట్లతో సీసీ రోడ్లు, రావివలస పాతకాలనీ, కొత్తకాలనీలకు చెరో రూ.50లక్షలతో సీసీరోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టనున్నారు. రూ.15లక్షల నిధులతో బస్షెల్టర్, రూ.20 లక్షలతో దొబీఘాట్, చెరో రూ.10 లక్షలతో మూడు కళావేదికలు, రూ.20 లక్షలతో లైబ్రరీ, డీఎంఎఫ్, ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.30 లక్షలతో డ్వాక్రా భవనం, రూ.12లక్షలతో అంగన్వాడీ భవనం నిర్మించనున్నారు. ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవో పంచాయతీరాజ్, ఎన్ఆర్ఈజీఎస్ అధి కారులు అవసరమైన నిధులు విడుదలకు రంగం సిద్ధం చేశారు.