Share News

Weather Update: 48 గంటల్లో నైరుతిలో కదలిక

ABN , Publish Date - Jun 13 , 2025 | 05:57 AM

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం నాటికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసరాల్లో కొనసాగుతోంది. దీని నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భ, మరట్వాడ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.

Weather Update: 48 గంటల్లో నైరుతిలో కదలిక

  • నేడు ఉత్తరకోస్తా, సీమకు భారీ వర్ష సూచన

  • 20వ తేదీ తరువాత అల్పపీడనం

విశాఖపట్నం, అమరావతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం నాటికి ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసరాల్లో కొనసాగుతోంది. దీని నుంచి ఛత్తీస్‌గఢ్, విదర్భ, మరట్వాడ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. ఈ ప్రభావంతో దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ నెల 18, 19 తేదీల్లో వాయవ్య, దానికి ఆనుకుని మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవరిస్తుందని, దాని ప్రభావంతో 20 తర్వాత అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో రానున్న రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం మన్యం, అల్లూరి, కాకినాడ, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. గురువారం రాత్రి 7 గంటల వరకు తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో 64 మిల్లీమీటర్లు, పల్నాడు జిల్లా మాచర్లలో 61.7, కాకాణిలో 55, చిత్తూరు జిల్లా రెడ్డిగుంటలో 54 మిల్లీమీటర్ల వాన పడింది.

Updated Date - Jun 13 , 2025 | 05:59 AM