YS Sharmila: జగన్ దగ్గర సొంత చెల్లికే మర్యాద లేదు
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:27 AM
వైఎస్ జగన్మోహన్రెడ్డి దగ్గర సొంత చెల్లికే గౌరవం, మర్యాద లేదు. రాష్ట్రంలోని మహిళలకు ఇంకేం గౌరవం ఉంటుంది?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

రాష్ట్రంలో మహిళలను ఇంకేం గౌరవిస్తారు?
సజ్జల మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు: షర్మిల
రాయచోటి, పుట్టపర్తి టౌన్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి దగ్గర సొంత చెల్లికే గౌరవం, మర్యాద లేదు. రాష్ట్రంలోని మహిళలకు ఇంకేం గౌరవం ఉంటుంది?’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా రాయచోటిలో, శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. ఆ రెండు చోట్ల ఆమె మీడియాతో మాట్లాడారు. ‘రక్త సంబంధమే నాపై విష ప్రచారం చేసింది. నేను వైఎస్సార్కు పుట్టలేదని, విజయమ్మకు తాను అక్రమ సంతానమని అన్నారు. అక్రమ సంబంధాలను అంటగట్టే సైతాన్ సైన్యం వైసీపీ. సజ్జల కొడుకు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని నాపై దాడి చేశాడు. రక్త సంబంధం, అక్కచెల్లెళ్ల బంధం గురించి వైసీపీ మాట్లాడడం విడ్డురంగా ఉంది. తల్లిని, చెల్లిని దూరం చేసుకున్న జగన్ సమాజానికి ఏం చెబుతారు? రాజధాని అమరావతి మహిళలపై సజ్జల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఆయన మూర్ఖుడిలా మాట్లాడుతున్నారు. మహిళలను పిశాచులతో పోల్చి రాక్షసులని, సంకర జాతి అని అవమానిస్తారా? చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడానికి నామోషీ ఎందుకు? కాంగ్రెస్ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’ అని షర్మిల హెచ్చరించారు.