Share News

School Reopening: గందరగోళంగా బడుల పునఃప్రారంభం

ABN , Publish Date - Jun 13 , 2025 | 04:39 AM

ప్రణాళికా లోపంతో పాఠశాల విద్యాశాఖ గందరగోళంగా మారింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరుచుకున్నా ఏ టీచర్‌ ఎక్కడున్నారో అర్థంకాని పరిస్థితి. బడులు తెరిచిన రోజే విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది.

School Reopening: గందరగోళంగా బడుల పునఃప్రారంభం

  • అధికారులంతా తల్లికి వందనంలో నిమగ్నం

  • కొనసాగుతున్న ఎస్జీటీల బదిలీలు

  • స్కూల్‌ అసిస్టెంట్లూ అటూ ఇటూ

  • ప్రారంభం కాని విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ప్రణాళికా లోపంతో పాఠశాల విద్యాశాఖ గందరగోళంగా మారింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా బడులు తెరుచుకున్నా ఏ టీచర్‌ ఎక్కడున్నారో అర్థంకాని పరిస్థితి. బడులు తెరిచిన రోజే విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ సరిపడా టీచర్లు లేక ఎక్కడా కిట్ల పంపిణీ ప్రారంభం కాలేదు. కొన్ని చోట్ల అరకొరగా పాఠ్యపుస్తకాలు మాత్రమే పంపిణీ చేశారు. ప్రస్తుత పాఠశాలల్లో ఉన్న టీచర్లు.. బదిలీల్లో కొత్తగా వచ్చే టీచర్లు పంపిణీ చేసుకుంటారనే ఉద్దేశంతో వదిలేస్తున్నారు. బడుల పునఃప్రారంభాన్ని పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు పూర్తిగా తల్లికి వందనం పథకం పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు సెకండరీ గ్రేడ్‌ టీచర్ల బదిలీలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఏడాది పాఠశాలల పునఃప్రారంభం అస్తవ్యస్తంగా మారింది. ఈసారి బదిలీలు సకాలంలో పూర్తికాకపోవడం ఇబ్బందిగా మారింది. ఎస్జీటీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ వల్ల వేల మంది టీచర్లు బదిలీల ప్రక్రియలో ఉండిపోయారు. దీంతో సింగిల్‌ టీచర్లు ఉన్న బడుల ప్రారంభం అయోమయంగా మారింది. స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీలు పూర్తయినా కొందరు మాత్రమే రిలీవ్‌ అయ్యారు. ఒకవేళ టీచర్లు రిలీవ్‌ అయినా పాత స్థానం ఖాళీగా మిగిలిపోతే తిరిగి అక్కడికే వచ్చి పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. చాలా మంది పాత పాఠశాలలకు తిరిగి రావట్లేదు. పల్నాడు జిల్లాలో ఈ తరహా సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. 500 మంది విద్యార్థులున్న ఒక ఉన్నత పాఠశాలలో ఒక్కరే సోషల్‌ టీచర్‌ ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో కొన్ని సబ్జెక్టులకు ఒక్కరూ టీచర్‌ లేరు. డీఈవో పట్టించుకోకపోవడం సమస్యలను మరింతగా పెంచుతోందని టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Jun 13 , 2025 | 04:40 AM