Nadendla Manohar: రైస్ కార్డులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు
ABN , Publish Date - May 23 , 2025 | 05:28 AM
రైస్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేయవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మ్యారేజ్ సర్టిఫికెట్లు అవసరం లేదని, దరఖాస్తుల పరిశీలన తర్వాత జూన్లో స్మార్ట్ కార్డులు అందజేస్తామన్నారు.

గడువు ఏమీ లేదు.. తొందరపడొద్దు
మ్యారేజ్ సర్టిఫికెట్, పెళ్లికార్డులు అక్కర్లేదు: నాదెండ్ల
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): కొత్త బియ్యం కార్డులు, పాత వాటిల్లో మార్పులు, చేర్పుల కోసం స్వీకరిస్తున్న దరఖాస్తులకు గడువు లేదని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అర్హత ఉన్న వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎవరూ తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ రైస్ కార్డులు అందిస్తామని స్పష్టం చేశారు. కొత్త రైస్ కార్డులు, ఇతర సేవల కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ 21 రోజుల్లోపే పరిశీలించి జూన్లో క్యూఆర్ కోడ్తో మొత్తం 4,24,59,128 మంది లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ కార్డులను అందజేస్తామన్నారు. గురువారం విజయవాడలోని సివిల్ సప్లయిస్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొత్త రైస్కార్డులు, మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు సమర్పించేవారు మ్యారేజ్ సర్టిఫికెట్లు, పెళ్లి ఫోటోలను జత చేయాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయాలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఉన్న రైస్ కార్డుల్లో పేర్లు తొలగింపు ప్రక్రియను డెత్ కేసులకు మాత్రమే పరిమితం చేశామని చెప్పారు. కార్డుల్లో పిల్లలను చేర్చడానికి వయసుతో సంబంధం లేదన్నారు. ఈనెల 7 నుంచి ఇప్పటి వరకు 5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. రైస్ కార్డుల డేటాను గ్రామ, వార్డు సచివాలయాలకు అనుసంధానం చేయడంతో సర్వర్లు డౌన్ అయ్యాయని, దీనివల్ల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
మ్యాపింగ్ సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీ
గత ప్రభుత్వం నిర్వహించిన హౌస్హోల్డ్ మ్యాపింగ్ వల్ల దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియలో ఎదురువుతున్న సాంకేతిక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వీటిపై ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత ఒక ఉన్నతస్థాయి కమిటీని వేసి వారం రోజుల్లోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు.
పండుగలా రేషన్ పంపిణీ
రాష్ట్ర చౌక ధరల దుకాణదారుల సంఘం పిలుపు
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ వాహనాలను నిలిపివేసి చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జూన్ 1న రేషన్ షాపులను అలంకరించి పండుగ వాతావరణంలో సరుకులు పంపిణీ చేయాలని రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘ అధ్యక్షుడు దివి లీలామాధవరావు డీలర్లకు పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈనెల25న అన్ని రేషన్ షాపుల వద్ద బ్యానర్లు కట్టి ప్రచారం చేయాలని సూచించారు..