10.87 Million Participate: రికార్డుల యోగా
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:32 AM
యోగాంధ్రలో 10.87 లక్షల మంది అనంతపురం జిల్లావాసులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. శనివారం విశాఖలో నిర్వహించిన యోగా వేడుకలను జిల్లాలోని నీలం సంజీవరెడ్డి పీటీసీ మైదానంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు

యోగాంధ్రలో 10.87 లక్షల మంది అనంతపురం జిల్లావాసులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. శనివారం విశాఖలో నిర్వహించిన యోగా వేడుకలను జిల్లాలోని నీలం సంజీవరెడ్డి పీటీసీ మైదానంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తూ కలెక్టర్ వినోద్కుమార్, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్పీ జగదీశ్ సహా పలువురు జిల్లా అఽధికారులు, ప్రజాప్రతిధులు, ప్రజలు యోగాసనాలు వేశారు. జిల్లా వ్యాప్తంగా 6,040 వేదికలలో 10.87 లక్షల మంది యోగాంధ్రలో భాగస్వాములయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయానికి యోగాంధ్ర రిజిస్ట్రేషన్లో ‘మిరాకిల్ వరల్డ్ రికార్డు’ దక్కిందని ఉపకులపతి ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. రికార్డుస్థాయిలో 18,662 మంది విద్యార్థులు యోగాంధ్రలో నమోదు చేయించుకున్న ఫలితంగా ఈ రికార్డు లభించిందని అన్నారు. ఈ నెల 18న 16,123 మంది విద్యార్థులతో మెగా యోగాంధ్ర నిర్వహించగా ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ దీనిని నమోదు చేసింది.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 4,600 కేంద్రాల్లో 8 లక్షల మంది యోగాసనాలు వేశారు. అమలాపురంలో కలెక్టర్ మహే్షకుమార్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు.
కాకినాడ జిల్లాలో 4,800 కేంద్రాల్లో యోగాసనాలు వేయగా జిల్లా కేంద్రంలో కలెక్టర్ షాన్మోహన్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లాలో 4,500 వేదికలపై యోగా కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. కొవ్వూరులో గోదావరి తీరంలో స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు.
రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తం
యోగాంధ్ర నిర్వహణతో రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. సీఎం చంద్రబాబు పిలుపుమేరకు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలు, కూటమి నేతలు, అధికారులకు ధన్యవాదాలు.
- మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి
నాకే బహుమతి ఇవ్వాలి!
యోగాసనాలు వేయకపోతే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి రావద్దని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో పట్టుదలతో సాధన చేసి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈవెంట్లో బహుమతి ఇస్తే అది నాకే ఇవ్వాలి.
- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
మానసిక ప్రశాంతతకు దోహదం
మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ యోగా ప్రాముఖ్యతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు.
- మంత్రి లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి