RBI: ఇక రాష్ట్రం నుంచే సేవలు
ABN , Publish Date - Jun 17 , 2025 | 03:32 AM
రాష్ట్రం నుంచి సేవలు అందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం సిద్ధమైంది. విజయవాడ బందరు రోడ్డులోని స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్లో ఏర్పాటుచేసిన ఈ కార్యాలయాన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్...

విజయవాడలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం
చాంబర్లకు గోదావరి, తుంగభద్రగా నామకరణం
విజయవాడ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రం నుంచి సేవలు అందించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయం సిద్ధమైంది. విజయవాడ బందరు రోడ్డులోని స్టాలిన్ సెంట్రల్ కాంప్లెక్స్లో ఏర్పాటుచేసిన ఈ కార్యాలయాన్ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చాంబర్లకు రాష్ట్రంలో ప్రవహించే నదుల పేర్లను పెట్టారు. ఒక చాంబర్కు తుంగభద్ర, మరో చాంబర్కు గోదావరిగా నామకరణం చేశారు. అలాగే, అత్యాధునిక సమావేశ మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. రెండంతస్తుల్లో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం కొలువుదీరింది. విభాగాలవారీగా కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ప్రాంతీయ డైరెక్టర్ అత్ ఒమర్ బషీర్, సీజీఎం పునీత్ పంచోలి తదితరులు పాల్గొన్నారు. కాగా, ఐబీడీ, ఎఫ్ఐడీడీ, ఫెడ్, రాజ్భాష సెల్, ఆడిట్ బడ్జెట్ అండ్ కంట్రోల్ సెల్ తదితర విభాగాలు విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో ప్రారంభమయ్యాయని ఓ ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నగదు నిర్వహణ హైదరాబాద్ ఆఫీసు నుంచి కొనసాగుతుందని ఆ ప్రకటనలో పేర్కొంది.