CID: కేసుల ఉచ్చులో పీఎస్ఆర్
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:35 AM
పీఎస్ఆర్ ఆంజనేయులపై కొత్త కేసు నమోదైంది. ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు ఆరోపణలు, హాయ్ల్యాండ్లో మూల్యాంకనం జరిగినట్లు అభ్యర్థులు చెప్పినట్టు పోలీసులు విచారణ చేస్తున్నారు.

తాజాగా మరొకటి నమోదు
ఏపీపీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
హాయ్ల్యాండ్ వేదికగా రాంగ్రూట్
గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలు రెండు సార్లు మూల్యాంకనం
పీఎస్ఆర్ నేతృత్వంలో మొదటిసారి
కోర్టు ఆర్డర్తో రెండోసారి దిద్దుబాటు
అభ్యర్థులు పసిగట్టి న్యాయ పోరాటం
విజయవాడ/అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐపీఎస్ అధికారి పి. సీతారామాంజనేయులు(పీఎ్సఆర్) చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై మరో కేసు నమోదైంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూపు-1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో ఆయన అక్రమాలకు తెరదీశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా వీటిపైనే క్రైం నంబరు 56/2025తో ఈ కేసు నమోదైంది. ఉన్నతాధికారులు ఈ కేసు విచారణ బాధ్యతలను నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్కు అప్పగించారు. గ్రూపు-1 పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనాన్ని గుంటూరు జిల్లా హాయ్ల్యాండ్లో చేయించారని ఆరోపణలు ఉన్నాయి. నాడు పరీక్షలు రాసిన అభ్యర్థులు ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పారు. అయితే, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది ప్రశ్న. ఈ క్రమంలో మంగళవారం దర్యాప్తు అధికారులు ఇద్దరు వ్యక్తుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసినట్టు తెలిసింది.
ఆ కేసు వివరాలు ఇవ్వండి: హైకోర్టు
గుంటూరు నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి పాత్ర ఉందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గత ఏడాది గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ పీఎ్సఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
పూజకు.. పుస్తకాలు ఇవ్వట్లేదు:పీఎస్ఆర్
జైలులో తాను పూజ చేసుకోవడానికి పుస్తకాలు, నుదుటున పెట్టుకోవడానికి బొట్టు ఇవ్వడం లేదని ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ ఆంజనేయులు న్యాయాధికారికి విన్నవించారు. సీఐడీ కస్టడీ ముగిసిన అనంతరం పోలీసులు మంగళవారం ఆయనను విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా న్యాయాధికారి పి. భాస్కరరావు.. ‘‘కస్టడీలో పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా?’’ అని అడిగారు. దానికి సీతారామాంజనేయులు జవాబు ఇస్తూ.. ‘‘నేను పూజ చేసుకోవడానికి పుస్తకాలు, నుదుటన పెట్టుకోవడానికి బొట్టు ఇవ్వడం లేదు. నేను జైలుకు వెళ్లిన మర్నాడు వాకింగ్కు వెళ్లినప్పుడు టీవీ ఉందని చెప్పారు. తర్వాత టీవీ లేదన్నారు. నా వల్ల ఇతర ఖైదీల సదుపాయాలు పోతున్నాయి. నేను జైలుకు వెళ్లడానికి ముందు ఇతర ఖైదీలకు 5 ములాఖత్లు ఉండేవి. నేను వెళ్లిన తర్వాత వాటిని మూడుకు కుదించారు. కస్టడీలో పోలీసులు ఇబ్బంది పెట్టలేదు. నేను ఫిట్గా ఉన్నప్పటికీ బీపీ ఎక్కువగా ఉందని పోలీసులు ఒక రోజు కస్టడీలోకి తీసుకోలేదు. మరోసారి పోలీసు కస్టడీకి ఇచ్చినా సహకరిస్తా’’ అని తెలిపారు. జైలులో ఏమైనా సదుపాయాలు కావాలంటే ఒక పిటిషన్ వేసుకోవాలని న్యాయాధికారి ఆయనకు సూచించారు. అనంత పీఎస్ఆర్ను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.