Yoga Day 2025: అంతర్జాతీయ యోగా డేకు పక్కాగా ఏర్పాట్లు
ABN , Publish Date - Jun 07 , 2025 | 03:24 AM
శాఖపట్నంలో ఈ నెల 21 నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

త్వరితగతిన టెండర్లు ఆహ్వానించడానికి ఆరోగ్యశాఖ జీవో
అమరావతి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో ఈ నెల 21 నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం.. అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా ప్రదేశాల్లో 2 కోట్ల మంది అంతర్జాతీయ యోగాడేలో పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని, కనీసం 25 లక్షల మంది 3 రోజులపాటు శిక్షణ పొంది యోగా సర్టిఫికెట్లు పొందేలా ప్రోత్సహించాలని, వీరందరికీ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలోని శిక్షకులతో శిక్షణ ఇప్పించాలని సూచించింది. జూన్ 21న విశాఖలో జరిగే కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించేలా 5 లక్షల మంది పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ ఏర్పాట్లన్నింటికీ అవసరమైన టెండర్లను త్వరితగతిన ఆహ్వానించి, ఆమోదించేందుకు ఏపీఎంఎస్ఐడీసీ, డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలు, ఇతర శాఖలకు అనుమతి ఇస్తూ శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ జీవో జారీ చేసింది.
యోగాంధ్రకు 1.86కోట్ల మంది నమోదు
యోగాంధ్రకు రెండు కోట్ల మంది హాజరయ్యేవారి లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 1.86కోట్ల మంది నమోదు చేసుకున్నారని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటీ కృష్ణబాబు ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై నివేదికను శుక్రవారం మంత్రుల బృందానికి అందజేశారు. ఇంకా రెండు వారాలు ఉన్నందున 2కోట్ల లక్ష్యాన్ని దాటవచ్చన్నారు. మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చే ట్రైనర్ల నమోదులో 2,600 లక్ష్యం పెట్టుకోగా లక్ష్యాన్ని మించి 5,451 మంది నమోదు చేసుకున్నారని తెలిపారు. మండల స్థాయిలో 1.25లక్షల ట్రైనర్ల లక్ష్యం కాగా 1.47లక్షల మంది నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇప్పటివరకూ 78,730 ప్రదేశాలను ఎంపిక చేశామని తెలిపారు.