మహిళలపై దాడి తప్ప వైసీపీ సాధించిందేమీ లేదు
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:17 PM
వైసీపీ అధ్యక్షుడు జగన్ పొదిలి పర్యటన మహిళలపై దాడి చేయడం తప్ప వాళ్లు సాఽధించిందేమీ లేదని ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు. జవహర్నగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది.

ఎమ్మెల్యే నారాయణరెడ్డి
మార్కాపురం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : వైసీపీ అధ్యక్షుడు జగన్ పొదిలి పర్యటన మహిళలపై దాడి చేయడం తప్ప వాళ్లు సాఽధించిందేమీ లేదని ఎమ్మెల్యే కం దుల నారాయణరెడ్డి అన్నారు. జవహర్నగర్ కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పొదిలి పర్యటనలో వైసీపీ మూకలు మహిళలపై ఏ విధంగా దాడి చేశారో వీడియోలను చూపించారు. ఎలాంటి సమస్య లేకున్నా కేవలం బల ప్రదర్శన కోసమే జగన్ పర్యటన ఏర్పాటు చేశారన్నారు. అమరావతి మహిళలను తీవ్ర పదజాలంతో వైసీపీ మీడియా సంస్థలో కించపరిచే విధంగా మాట్లాడినందుకు తెలుగు మహిళలు శాంతియుతంగా నిరసన తెలిపారన్నారు. కానీ మద్యం మత్తులో వైసీపీ రౌడీ మూకలు ఇష్టారాజ్యంగా రాళ్లు, చెప్పులతో మహిళలని కూడా చూడకుండా దాడి చే యడం సిగ్గుచేటన్నారు. అలాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేస్తుంటే వైసీపీ నాయకులు గగ్గోలు పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గత వైసీపీ పాలనలో తాను ప్రజా సమస్యలపై నిరసనలు, ధర్నాలు చేస్తే 17కేసులు నమోదు చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ పాలనను వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం కింద తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంటే వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా విమర్ళలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే లబ్ధి కలిగిందన్నారు. కానీ నేడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.13వేల చొప్పున ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి తట్టుకోలేక వైసీపీ శ్రేణులు దుష్ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు వక్కలగడ్డ మల్లికార్జున్, తాళ్లపల్లి సత్యనారాయణ, గుంటక సుబ్బారెడ్డి, మాలపాటి వెంకటరెడ్డి, కనిగిరి బాలవెంకటరమణ పాల్గొన్నారు.