Share News

అన్నదాతకు అండగా

ABN , Publish Date - Aug 02 , 2025 | 10:52 PM

అన్నదాతకు అన్నివిధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. మండంలంలోని నికరంపల్లి, భూపతిపల్లి గ్రామాలలో శనివారం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

అన్నదాతకు అండగా
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందుల

సుఖీభవ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి

మార్కాపురం రూరల్‌, ఆగస్టు (ఆంధ్రజ్యోతి) : అన్నదాతకు అన్నివిధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి భరోసా ఇచ్చారు. మండంలంలోని నికరంపల్లి, భూపతిపల్లి గ్రామాలలో శనివారం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల మాట్లాడుతూ గత వైసీపీ పాలకులు ప్రజలను మభ్య పెట్టి మోసం చేశారన్నారు. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సులో ప్రయాణించే సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండా జగన్‌రెడ్డి పూర్తి చేశామని నమ్మబలికి పశ్చిమ ప్రజలను మోసగించారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నికరంపల్లి గ్రామంలో 370 మంది, భూపతిపల్లిలో 1142 మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలలో నగదు జమ అవుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. అలాగే నూతనంగా మంజూరైన పింఛన్‌లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌చార్జి కందుల రామిరెడ్డి, ఏడీఏ బాలాజి నాయక్‌, ఏవో బుజ్జిబాయి, మార్కెట్‌ యార్డు చైర్మన్‌ మాలపాటి వెంకటరెడ్డి, డీటీ శ్రీనివాసులు, వెలుగు ఏపీఎం పిచ్చయ్య, గ్రామ సర్పంచ్‌ జీ పార్వతమ్మ, టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే లక్ష్యం : ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

గిద్దలూరు టౌన్‌, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : రైతుల సంక్షేమమే ప్ర భుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. మార్కెట్‌యార్డు ఆవరణలో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలోని 37వేల మంది రైతులకు మొదటి విడత పెట్టుబడి సాయం కింద మంజూరైన రూ.26కోట్ల విలువైన చెక్కులను విడుదల చేశారు. ప్రతి రైతుకు మొదటి విడతగా రూ.7వేలు వారి ఖాతాలలో జమ చేస్తారన్నారు. 3 విడతల్లో మొత్తం 20 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తుందని తెలిపారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని, అది కూడా త్వరలోనే మొదలవుతుందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న ప్రజా ప్రభుత్వంపై జగన్‌రెడ్డి బ్యాచ్‌ విమర్శలు చేయడాన్ని అశోక్‌రెడ్డి తప్పుబట్టారు. ప్రజలే వారికి బుద్ధి చెప్తారన్నారు. కార్యక్రమంలో గిద్దలూరు, కంభం మార్కెట్‌యార్డు చైర్మన్లు బైలడుగు బాలయ్య, పూనూరు భూపాల్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య, జడ్‌పిటిసి బుడత మధుసూదన్‌, సొసైటీ చైర్మన్లు దుత్తా బాలీశ్వరయ్య, బిజ్జం రవీంద్రరెడ్డి, జనసేన పార్టీ ఇన్‌చార్జి బెల్లంకొండ సాయిబాబు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జేవీ నారాయణ, వివిధ మండలాల టీడీపీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.

రైతులను నిలువునా ముంచిన జగన్‌రెడ్డి

టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు

ఎర్రగొండపాలెం రూరల్‌ : వెలిగొండ ప్రాజెక్టును పూర్తి కాకుండానే పూర్తి చేశామని జాతికి అంకితం చేసి జగన్‌రెడ్డి పశ్చిమ ప్రజలను మోసగించారని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. శనివారం మండలంలోని అమానిగుడిపాడు గ్రామంలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్‌ మొదటి విడత సాయాన్ని రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారన్నారు. మరికొద్ది రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తుందన్నారు. వైపాలెం నుంచి గెలిచి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆశ్రమ పాఠశాలకు డోరు కూడా ఏర్పాటు చేయలేకపోయారని విమర్శించారు. ఇప్పుడు గెలిచిన వ్యక్తి హైదరాబాద్‌లో డిబేట్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఇలాంటి మోసగాళ్లు ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో రూ.150కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యేగా నేను గెలవలేకపోయినా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని ఎరిక్షన్‌బాబు తెలిపారు. మొత్తం 39,274 మంది రైతులకు రూ.26.33కోట్లు జమ కానున్నట్లు వ్యవసాయ సంచాలకులు వెంకటరమణ తెలిపారు. ప్రధాని రేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లైవ్‌ కార్యక్రమాలను రైతులు, ప్రజలతో కలసి తిలకించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చేకూరి సుబ్బారావు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఏవో కె నీరజ, టీడీపీ నాయకులు చిట్యాల వెంగళరెడ్డి, వేగినాటి శ్రీను, మహేష్‌ నాయుడు, సుబ్బారావు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 10:52 PM