తల్లికి వందనం.. పేదల ఇంట ఆనందం
ABN , Publish Date - Jun 14 , 2025 | 11:15 PM
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం మండలంలో 4,269 మందికి వర్తించింది. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ముగ్గురు, నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ డబ్బులు జమ అయ్యాయి.

రాచర్ల మండలంలో 4,269 మందికి
ఒక్కో కుటుంబంలో ముగ్గురు, ఐదుగురికి వర్తింపు
రాచర్ల, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం మండలంలో 4,269 మందికి వర్తించింది. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబంలో ముగ్గురు, నలుగురు పిల్లలు ఉన్నప్పటికీ డబ్బులు జమ అయ్యాయి. దీంతో ఆయా కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఆకవీడు-1 పంచాయతీలో మొత్తం 509 మందికి గాను 461 మంది అర్హులు, 48 మంది అనర్హులుగా, ఆకవీడు-2లో 190 మందికి గాను 175 మంది అర్హులు, 15 మంది అనర్హులు, చోళ్లవీడులో 418 మందికి గాను 360 మంది అర్హులు, 58 మంది అనర్హులు, చినగానిపల్లెలో 242 మందికి గాను 218 మంది అర్హులు, 24 మంది అనర్హులు, జేపీ చెరువులో 303 మందికి గాను 273 మంది అర్హులు, 30 మంది అనర్హులు, అనుమలపల్లెలో 413 మందికి గాను 355 మంది అర్హులు, 58 మంది అనర్హులు, రాచర్ల-1లో 619 మందికి గాను 506 మంది అర్హులు, 113 మంది అనర్హులు, రాచర్ల-2లో 197 మందికి గాను 169 మంది అర్హులు, 28 మంది అనర్హులు, అనుమలవీడులో 376 మందికి గాను 311 మంది అర్హులు, 65 మంది అనర్హులు, సోమిదేవిపల్లిలో 161 మందికి గాను 135 మంది అర్హులు, 26 మంది అనర్హులు, గుడిమెట్టలో 382 మందికి గాను 315 మంది అర్హులు, 67 మంది అనర్హులు, సత్యవోలులో 215 మందికి గాను 195 మంది అర్హులు, 20 మంది అనర్హులు, యడవల్లిలో 244 మందికి గాను 183 మంది అర్హులు, 61 మంది అనర్హులుగా గుర్తింపపడ్డారు. మండలస్థాయిలో 4269 మందికి గాను 3656 మంది అర్హులు, 613 మంది అనర్హులుగా గుర్తించారు. ముగ్గురికి, నలుగురికి కూడా తల్లికి వందనం వర్తించినట్లు తెలిపారు. అనర్హులుగా గుర్తింపబడ్డ వారికి త్వరలో తల్లికి వందనం వర్తిస్తుందని, అంతేకాకుండా వివిధ కారణాల చేత తల్లికి వందనం వర్తించని వారికి కూడా వర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఎంఇఒ వి.గిరిధరశర్మ తెలిపారు.
కంభం, అర్ధవీడు మండలాల్లో
కంభం : ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ తల్లికి వందనం పథకం వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారు. శుక్రవారం పాఠశాలలు ప్రారంభించిన రోజే తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేయడంతో ఆయా కుటుంబాల వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ అజెండా
తల్లికి వందనం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన ఎమ్మెల్యే కందుల
మార్కాపురం, జూన్ 14 (ఆంధ్రజ్యోతి) : ప్రజల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ అజెండా అని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. తల్లికి వందనం పథకం కింద లబ్ధిదారులైన పలువురి ఇళ్లకు శనివారం ఎమ్మెల్యే నారాయణరెడ్డి వెళ్లి పలుకరించారు. ముఖ్యంగా వారి అనుభూతులను అడిగి తెలుసుకున్నారు. మూడు నుంచి ఐదు మంది పిల్లలు ఉన్న మహిళలకు అందరికీ రూ.13వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం నగదు జమ కావడం ఎంతో సంతోషంగా ఉందని లబ్ధిదారుల ఆయనకు తెలిపారు. పిల్లల చదువులు ఇక తమ కుటుంబాలకు ఏమాత్రం భారం కాదని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆవుల అల్లూరమ్మ ఇంటిలో ఐదు మంది పిల్లలుంటే వారికి ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున మొత్తం రూ.65 వేలు నగదు వచ్చినట్లు తెలిపారు. తమకు పక్కా గృహం లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలపడంతో తాను తప్పకుండా ఇంటిని మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చిన్నారులకు చాక్లెట్లు పంచి పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి పేరుతో రూ.15 వేలు ఇస్తానని చెప్పి గెలిచాక జగన్రెడ్డి కేవలం ఒక్కరికి మాత్రమే రూ.13 వేలు అందించినట్లు గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం వర్తించేలా చేశారని కందుల పేర్కొన్నారు. ఆయన వెంట మున్సిపల్ ఏఈలు ఉమామహేశ్వరరావు, భూపాల్రెడ్డి, సచివాలయాల సిబ్బంది, టీడీపీ నాయకులు మాలపాటి వెంకటరెడ్డి, కౌన్సిలర్ షేక్ చిన్నషెక్షావలి పాల్గొన్నారు.
పిల్లల భవిష్యత్కు బంగారుబాట
గిద్దలూరు టౌన్ : ప్రజా ప్రభుత్వం విద్యార్థుల కోసం తల్లికి వం దనం పథకం విద్యార్థుల భవిష్యత్కు బంగారుబాట వేస్తుందని సొసై టీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాలీశ్వరయ్య అన్నారు. ప్రభుత్వం తల్లికి వందనం అందించడంతో లబ్ధిపొందిన చిన్నారులు, వారి తల్లులు 5వ వార్డులో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ము ఖ్యమంత్రి పవన్కల్యాణ్, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమం 5వ వార్డు ఇన్చార్జి సంపత్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో జరగ్గా విద్యార్థులు, వారి తల్లులు పాల్గొన్నారు.
చంద్రబాబుకు కృతజ్ఞతలు
గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా తమ కుటుంబంలో ఒక్కరికే లబ్ధి చేకూరింది. ప్రస్తుత ప్రభుత్వంలో మా ముగ్గురు పిల్లలకు తల్లికి వం దనం వర్తించింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
- రవికుమార్, రాచర్ల
తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జగన్ హయాంలో ఒక్కరికే డబ్బులు జమ అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం ముగ్గురు పిల్లలకూ పథకం వర్తింప చేసింది.
- చల్లా సంజయ్, చోళ్లవీడు
కంభం తెలుగువీధికి చెందిన ఉయ్యాలవాడ నరేంద్రప్రసాద్ దంపతులకు ముగ్గురు సంతానం. వీరు కూరగాయలు అమ్మి జీవిస్తుంటారు. పిల్లల చదువుల కోసం కష్టాలు పడేవారు. ప్రభుత్వం ముగ్గురు పిల్లలకు రూ.39వేలు జమ చేయడంతో వారి ఆనందానికి హద్దులు లేవు. వారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఒక్కరికే వేసి మోసం చేసిందని, ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలపెట్టుకున్నదన్నారు. వారు ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబుకు కృతజ్ఞతలు
పెద్ద దోర్నాల : మండలంలోని హసనాబాద్ గ్రామానికి చెందిన ఈదర లక్ష్మీదేవి తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా తన పిల్లలిద్దరికీ డబ్బులు అకౌంటులో వేసి చదువుకు భరోసా ఇచ్చనందులకు చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
- ఈదర లక్ష్మీదేవి, హసనాబాద్ గ్రామం. దోర్నాల మండలం
ప్రభుత్వానికి మా మద్దతు
చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఎంత మంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామన్నారు. పాఠశాలలు తెరిచే సమయంలో మా ఇద్దరి పిల్లలకు డబ్బులు వేశారు. సంతోషంగా ఉంది. మా మద్దతు ఎప్పుడూ ఈ ప్రభుత్వానికే ఉంటుంది.
- శంకుల నారాయణమ్మ,
హసనాబాద్ గ్రామం, దోర్నాల