Share News

చట్టాలను అతిక్రమించవద్దు

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:19 PM

ప్రతి ఒక్కరూ చట్టాలను అతిక్రమించవద్దని జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార చైర్‌పర్సన్‌ ఎ.భారతి అన్నారు. శనివారం పట్టణంలోని సబ్‌ జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసమయంలో ఉన్న విచారణ ఖైదీలను, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో ఆమె మాట్లాడారు.

చట్టాలను అతిక్రమించవద్దు
సబ్‌ జైలులో నిత్యావసర సరుకులను పరిశీలిస్తున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి భారతి

జిల్లా ప్రధాన న్యాయాధికారి భారతి

సబ్‌ జైళ్ల ఆకస్మిక తనిఖీ

గిద్దలూరు టౌన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ చట్టాలను అతిక్రమించవద్దని జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయ సేవాధికార చైర్‌పర్సన్‌ ఎ.భారతి అన్నారు. శనివారం పట్టణంలోని సబ్‌ జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసమయంలో ఉన్న విచారణ ఖైదీలను, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలతో ఆమె మాట్లాడారు. ఆ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత సబ్‌ జైలులో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడారు. మంచి చెడులను గ్రహించే విచక్షణా జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. కుటుంబసభ్యుల మధ్య సత్సంబంధాలు మెరుగుపడ్టాని, అవి కొరవడిన రోజు మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నం అయినపుడు సమాజంలో శాంతి ఉండదన్నారు. ఆవేశంతో విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి నిగ్రహం కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారని, అలాగే మత్తు పదార్థాలకు బానిసైన యువత ఆరోగ్యాన్ని నష్టం చేసుకోవడమేకాక కుటుంబ సభ్యులకు దూరమవుతున్నారని ఆమె అన్నారు. బెయిల్‌, అరెస్టు, ఉచిత న్యాయ సహాయం గురించి అవగాహన కల్పించారు. విచారణ ఖైదీలకు అందుతున్న సదుపాయాలు, ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ షేక్‌ ఇబ్రహీంషరీఫ్‌, గిద్దలూరు అడిషనల్‌ జ్యుడీషియల్‌ మేజిస్ర్టేట్‌ ఆఫ్‌ ది ఫస్ట్‌క్లాస్‌ కె.భరత్‌చంద్ర, సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ యు.లింగారెడ్డి, న్యాయవాది సీహెచ్‌ పోలయ్య, పారా లీగల్‌ వలంటీర్‌ అద్దంకి మధుసూదన్‌రావు, జైలు సిబ్బంది పాల్గొన్నారు.

మార్కాపురం : జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎ.భారతి శనివారం మార్కాపురం సబ్‌జైల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆ మె సబ్‌జైల్‌ పరిసరాలను పరిశీలించారు. ప్రధానంగా కిచెన్‌, పారిశుధ్య పరిస్థితి, ఖైదీల వసతి తదితర అంశాలపై పరిశీలించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా న్యాయవాదిని పెట్టుకోలేకుంటే మండల న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా ఏర్పాటు చేస్తామని వారికి తెలిపారు. వారిలో మార్పు వచ్చే విధంగా జైలు సిబ్బంది పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆమె వెంట మార్కాపురం ఆరవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్‌.శుభవాణి, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం.బాలాజీ, జైలు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:19 PM