Podili Attack Case: ముందస్తు వ్యూహంతోనే అరాచకం
ABN , Publish Date - Jun 13 , 2025 | 03:46 AM
ముందస్తు వ్యూహం, పక్కా ప్రణాళికతోనే వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడినట్లు గుర్తించాం, దీనిపై లోతుగా పరిశీలిస్తున్నాం. వాట్సా్ప్లోముందురోజు వచ్చిన మెసేజ్లను పరిశీలిస్తే కుట్రకోణం ఉన్నట్లు తెలుస్తోంది’ అని ప్రకాశం జిల్లా ఏఎస్పీ...

కుట్ర కోణంపై పోలీసులు అనుమానాలు
ముందురోజు వాట్సాప్ మెసేజీల పరిశీలన
పొదిలిలో మహిళలపై దాడి కేసులో తొమ్మిది మంది వైసీపీ మూకల అరెస్టు
పొదిలి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ‘ముందస్తు వ్యూహం, పక్కా ప్రణాళికతోనే వైసీపీ మూకలు అల్లర్లకు పాల్పడినట్లు గుర్తించాం, దీనిపై లోతుగా పరిశీలిస్తున్నాం. వాట్సా్పలో ముందురోజు వచ్చిన మెసేజ్లను పరిశీలిస్తే కుట్రకోణం ఉన్నట్లు తెలుస్తోంది’ అని ప్రకాశం జిల్లా ఏఎస్పీ కె.నాగేశ్వరరావు అనుమానం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ పొదిలి పర్యటనలో ఆ పార్టీ మూకలు మహిళలు, పోలీసు సిబ్బందిపై రాళ్లతో దాడి చేసిన ఘటనలో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. గురువారం పొదిలి పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అల్లర్లు సృష్టించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ప్రభుత్వ ఆస్తులను నష్టపరచడంతో పాటు మహిళలపై రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. రాజధాని మహిళలను కించపరిచారనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో భాగంగా పొదిలిలో కూడా మహిళలు అమ్మవారిశాల బజారు, బెస్తపాలెం ప్రాంతాల్లో రోడ్డు మార్జిన్లో శాంతియుతంగా నిరసన తెలిపారని చెప్పారు. ఆ సమయంలో జగన్ ర్యాలీలో పాల్గొన్న అల్లరిమూకలు ప్రణాళికతోనే చెప్పులు, వాటర్ బాటిళ్లు, రాళ్లతో మహిళలపై దాడి చేశారని తెలిపారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన బందోబస్తులో ఉన్న దర్శి డీఎస్పీ, ఒంగోలు రూరల్ సీఐ, మిగతా సిబ్బందిపై కూడా దాడులకు పాల్పడ్డారని చెప్పారు. వేలం కేంద్రంలోకి జగన్తో పాటు ముఖ్య నాయకులకు మాత్రమే అనుమతి ఉందని మార్కాపురం డీఎస్పీ తమ సిబ్బందితో కలిసి పదేపదే చెబుతున్నా అల్లరి మూకలు వారిని తోసుకుంటూ ‘ఎవరైనా రాని తొక్కిపడేస్తాం’ అంటూ బలవంతంగా లోపలికి పోయారని తెలిపారు.
ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాబూరావుకూ గాయాలయ్యాయన్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించామని, వారిలో 9 మందిని గురువారం అరెస్టు చేశామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో మద్యం తాగి అల్లరి మూకలు దాడులకు తెగబడ్డారని తెలిపారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియాలో ముందు రోజు మెసేజ్లను పరిశీలించామని, అందులో ‘రేపు జగనన్న పర్యటనలో ప్రభుత్వ రూల్స్ కాదు.. జగనన్న రూల్స్’ అంటూ రెచ్చగొట్టే మెసేజ్లు ఉన్నాయన్నారు. ఇది ముందస్తు వ్యూహంగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో మరి కొంతమందిని గుర్తించామని, వారినీ త్వరలో అరెస్టు చేస్తామని పేర్కొన్నారు.