Revenue Department: మదనపల్లెలో పెద్దిరెడ్డి కబ్జా
ABN , Publish Date - May 20 , 2025 | 04:12 AM
మదనపల్లె బీకే పల్లె వద్ద మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించిన 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సర్వేలో గుర్తించిన అనంతరం ఫెన్సింగ్ తొలగించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.

1.35 ఎకరాల్లో స్తంభాలు నాటి ఫెన్సింగ్
రెవెన్యూ అధికారుల సర్వేలో గుర్తింపు
హద్దులు నిర్ణయించి స్వాధీనం
సిమెంటు స్తంభాలు, కంచె తొలగింపు
హెచ్చరిక బోర్డు ఏర్పాటు
మదనపల్లె, మే 19 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా మదనపల్లె శివారులోని బీకే పల్లె సర్వే నంబర్ 552లోని భూమిని రెవెన్యూ అధికారులు సోమవారం సర్వే చేశారు. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తేలింది. ఈ సర్వే నంబర్లో 10.05 ఎకరాలు ఉండగా.. అందులో ఓ మాజీ సైనికుడి కుటుంబం నుంచి సర్వే నంబర్ 552-7లో 3.40 ఎకరాలు, సర్వే నంబర్ 552-8లో 0.50 ఎకరాలను పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత పేరుతో కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇందులో బైపాస్ రోడ్డు ఫ్లైఓవర్కు 18 సెంట్లు పోయింది. అదే 552-7కు ఆనుకుని ఉన్న 552-1 పార్టులో 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన పెద్దిరెడ్డి కుటుంబం.. చుట్టూ స్తంభాలు నాటి ఫెన్సింగ్ వేసింది. బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉండడంతో ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. తాజాగా కలెక్టర్ చామకూరి శ్రీధర్, సబ్కలెక్టర్ మేఘస్వరూప్, స్థానిక తహశీల్దార్ ధనంజయులు దీనిపై దృష్టి సారించారు. సబ్కలెక్టర్ ఆదేశాల మేరకు ఆక్రమిత ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం మండల సర్వేయర్ రెడ్డి శేఖర్బాబు, ఆర్ఐ భరత్రెడ్డి క్షేత్రస్థాయికి వెళ్లారు. సర్వే నంబర్ 552లోని పదెకరాలకు సరిహద్దులు నిర్ణయించి సర్వే చేశారు. ఇందులో పెద్దిరెడ్డి భార్య పేరున ఉన్న భూమికి ఆనుకునిసర్వే నంబర్ 552-1లో ఉన్న 1.35 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసినట్లు గుర్తించి హద్దులు నిర్ణయించామని తహశీల్దార్ ధనంజయులు పేర్కొన్నారు. ఆ 1.35 ఎకరాలను కలెక్టర్ ఆదేశాల మేరకు స్వాధీనం చేసుకుని ట్రెంచ్ కొట్టి.. హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆక్రమిత భూమి చుట్టూ ఉన్న సిమెంటు స్తంభాలు, ఫెన్సింగ్ కమ్మిని తొలగించారు.