పల్నాడుపై యుద్ధానికి వెళ్లినట్లుంది: కన్నా
ABN , Publish Date - Jun 20 , 2025 | 05:27 AM
సత్తెనపల్లి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల ఓదార్పుకు వెళ్లినట్టుగా లేదు. పల్నాడుపై యుద్ధానికి వెళ్లినట్లుంది’ అని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

సత్తెనపల్లి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): సత్తెనపల్లి, జూన్ 19(ఆంధ్రజ్యోతి): ‘మాజీ సీఎం వైఎస్ జగన్ రెంటపాళ్ల ఓదార్పుకు వెళ్లినట్టుగా లేదు. పల్నాడుపై యుద్ధానికి వెళ్లినట్లుంది’ అని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గురువారం గుంటూరులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నాగమల్లేశ్వరరావు ఎందుకు చని పోయాడో జగన్ పర్యటనకు ముందే మేం చెప్పాం. జగన్ది రాక్షస పాలన. ఇప్పటికీ ఆయనలో మార్పు రాలేదు. పోలీసుల మాటను బేఖాతరు చేసి, నిబంధనలు ఉల్లంఘించి ఇద్దరు ప్రాణాలు పోవటానికి జగన్ కారకుడయ్యాడు. రెంటపాళ్ల నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు నూటికి నూరు పాళ్లు జగనే కారణం. అడ్డు వచ్చినవారిని రప్పా రప్పా నరుకుంటూ పోతామంటూ ఫ్లకార్డులతో ర్యాలీలు చేపట్టడం జగన్ క్రిమినల్ ఐడియాలజీకి నిదర్శనం’ అని విమర్శించారు. ‘జగన్ బెదిరింపులకు భయపడే వారెవ్వరూ లేరు. వైసీపీ నాయకులు బారికేడ్లను తొలగించి నిబంధనలను ఉల్లంఘించారు. జగన్ పర్యటన సందర్భంగా ఇరువురు మృతికి ఆయనే బాధ్యత వహించాలి. ఏడాది క్రితం చనిపోయిన వారిని పరామర్శించారు గానీ ర్యాలీలో చనిపోయిన వారి కుటుంబాలను పలుకరించే సమయం ఆయనకు లేదు’ అని మండిపడ్డారు.
‘కమ్మ‘ గురించి మొసలి కన్నీరు
రెంటపాళ్ల పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్ కమ్మ సామాజిక వర్గం గురించి మొసలి కన్నీరు కార్చారని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ‘అధికారంలో ఉండగా తన ఆనందం కోసం కమ్మ వారిని కమ్మవారి చేత తిట్టించారు. అసెంబ్లీని కౌరవ సభ చేశారు. కమ్మ ద్వేషంతో అమరావతి ప్రాంతాన్ని సర్వనాశనం చేశారు. వారిపై ద్వేషమే 2024 ఎన్నికల్లో జగన్కు శాపమైంది. కమ్మవారిపై ద్వేషంతోనే అమర రాజా కంపెనీని రాష్ట్రం నుంచి తరిమేశారు. జగన్ నాటకాలను, డ్రామాలను ప్రజలు పట్టించుకోరు’ అని కన్నా అన్నారు.