Share News

Nimmala Ramanaidu: బనకచర్లతో సీమ సస్యశ్యామలం

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:40 AM

పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో కరువు నేల రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ సంకల్పంతోనే ఈ పథకాన్ని తలపెట్టారని తెలిపారు.

Nimmala Ramanaidu: బనకచర్లతో సీమ సస్యశ్యామలం

  • ఆ సంకల్పంతోనే చంద్రబాబు తలపెట్టారు

  • గోరుకల్లు రాతిపరుపు కుంగిపోయిన పాపం జగన్‌దే: నిమ్మల

  • అరక పట్టి.. పొలం దున్ని ఏరువాక సాగిన మంత్రి

కర్నూలు/పాణ్యం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతో కరువు నేల రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ సంకల్పంతోనే ఈ పథకాన్ని తలపెట్టారని తెలిపారు. ఇది పూర్తయితే కరువును శాశ్వతంగా నివారించవచ్చని చెప్పారు. కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌరు చరితతో కలసి వివిధ అభివృద్ధి పనులు, రహదారులను ప్రారంభించారు. గోరుకల్లు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వద్ద కుంగిపోతున్న రాతిపరుపు (స్టోన్‌ రివిట్‌మెంట్‌)ను పరిశీలించారు. కల్లూరు మండలం తడకనపల్లెలో జరిగిన సభలో పాల్గొన్నారు. ‘గోరుకల్లు రిజర్వాయర్‌ రాతి పరుపు కుంగిపోవడానికి జగన్‌ పాపమే కారణం. ఆయన హయాంలో నిర్వహణ, మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరమ్మతుల కోసం రూ.58 కోట్లతో ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. వైసీపీ పాలనలో పింఛాడ్యాం, అన్నమయ్య డ్యాం, పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయి. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 41 మంది ప్రాణాలు కోల్పోయినా జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కాలు బయటకు పెట్టలేదు. ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు వెళ్లి బాధితులను పరామర్శించారు. రాయలసీమకు శ్రీశైలం ప్రాజెక్టు వరప్రదాయిని. ప్లంజ్‌పూల్‌ మరమ్మతులకు రూ.30 కోట్లు కేటాయించాం. హంద్రీ-నీవా ప్రాజెక్టులో మోటార్లను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చేపట్టే పనులకు సీఎం రూ.3,800 కోట్లు కేటాయించారు. జగన్‌ ప్రభుత్వం మోటారు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేదు. రాష్ట్ర విభజన కంటే ఆయన పాలనతోనే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ తప్పిదాలు సరిచేయడానికే సరిపోతోంది. ఏడాది పాలనలో కర్నూలు జిల్లాలో రూ.2,014 కోట్లతో 2,294 ప్రగతి పనులు చేపట్టాం’ అని వివరించారు.


ఏరువాకలో నాగలి పట్టిన మంత్రి

ఏరువాక పౌర్ణమి వేడుకలను ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రైతులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సారి వేడుకల్లో మంత్రి నిమ్మల కూడా పాలుపంచుకున్నారు. రైతులతో ముచ్చటించి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఆయన స్వతహాగా రైతు కావడంతో తడకనపల్లెలో కాసేపు నాగలి పట్టి కాడెద్దులతో పొలం దున్నారు.

Updated Date - Jun 12 , 2025 | 04:42 AM