Share News

Liquor Scam: మద్యం స్కాంలో మిథున్‌రెడ్డిదే కీలక పాత్ర

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:10 AM

మద్యం కుంభకోణం ప్రణాళికను రచించి, అమలు చేయడంలో వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిది కీలక పాత్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పేర్కొంది. ప్రధాన వ్యూహకర్త ఆయనేనని తెలిపింది.

Liquor Scam: మద్యం స్కాంలో మిథున్‌రెడ్డిదే కీలక పాత్ర

  • ప్రధాన వ్యూహకర్త ఆయనే

  • హైకోర్టులో సిట్‌ కౌంటర్‌

  • ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు

  • సిట్‌ అభ్యర్థన-నేడు విచారణ

అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం ప్రణాళికను రచించి, అమలు చేయడంలో వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిది కీలక పాత్ర అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పేర్కొంది. ప్రధాన వ్యూహకర్త ఆయనేనని తెలిపింది. మిథున్‌రెడ్డితోపాటు ఈ కేసులోని ఇతర నిందితులు ముడుపుల రూపంలో రూ.3,600 కోట్ల అనుచిత లబ్ధి పొందారని, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలుగజేశారని వెల్లడించింది. ఈ మేరకు సిట్‌ అదనపు ఎస్పీ, దర్యాప్తు అధికారి హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ‘2019-24 మధ్య భారీ స్థాయిలో లిక్కర్‌ స్కాం జరిగింది. అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్‌ పాలసీ ద్వారా ముడుపులు చెల్లించిన కంపెనీలకే మద్యం ఆర్డర్లు ఇచ్చారు. మిథున్‌రెడ్డి గతంలో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన అనంతరం దర్యాప్తులో కీలక పురోగతి ఉంది. కేసులో మొదటి నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేశాం. గతంలో సేకరించిన ఆధారాలతో తాజా ఆధారాలను సరిపోల్చి చూస్తే మద్యం కుంభకోణం ప్రణాళిక రచించి దానిని అమలు చేయడంలో మిథున్‌రెడ్డిదే కీలక పాత్ర అని వెల్లడైంది. ఒక మద్యం తయారీ కంపెనీ నుంచి ఆయన కుటుంబ సభ్యులకు చెందిన పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌కు సొమ్ము బదిలీ అయినట్లు గుర్తించాం. ఆయన తన ఎంపీ పదవిని దుర్వినియోగం చేసి తనతోపాటు ఇతర నిందితులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు. నచ్చిన కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చేందుకు వీలుగా గతంలో ఉన్న ఆటోమేషన్‌ విధానం స్థానంలో మాన్యువల్‌ విధానం తీసుకొచ్చారు. మెజారిటీ ముడుపులను బంగారం, నగదు రూపంలో స్వీకరించారు.


ముడుపులు తనతోపాటు కుటుంబ సభ్యులు, సహచరులకు వచ్చేలా ప్రణాళిక రచించారు. ఆయనకు సంబంధం ఉన్న కంపెనీకి వివిధ మార్గాల ద్వారా రూ.5 కోట్లు చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఆర్థిక లావాదేవీలను వెలికితీసేందుకు మిథున్‌రెడ్డిని కస్టడీలో విచారించాలి. మద్యం అమ్మకాల విషయంలో తమతో కలిసి పనిచేస్తే ఐఏఎస్‌ అధికారిగా పదోన్నతి కల్పిస్తామని అప్ప టి ఏపీఎ్‌సబీసీఎల్‌ అసిస్టెంట్‌ సెక్రటరీ సత్యప్రసాద్‌కు మిథున్‌రెడ్డి హామీ ఇచ్చారు. మద్యం కంపెనీల నుంచి ముడుపుల రూపేణా నెలకు రూ.50 నుంచి 60 కోట్లు ఆర్జించవచ్చని మిథున్‌రెడ్డి, అప్పటి ఎంపీ విజయ్‌సాయిరెడ్డి అంచనాకు వచ్చారు. మద్యం పాలసీ అమలులోకి వచ్చాక ఆ సొమ్మును కసిరెడ్డి ప్రతి నెలా మిథున్‌రెడ్డి, ఇతర నిందితులకు చేరవేశారు. మద్యం ముడుపుల కుట్రను పక్కాగా అమలు చేసేందుకు మిథున్‌రెడ్డి ఇతర నిందితులతో తరచూ సమావేశాలు నిర్వహించేవారు. 2019-24 మధ్య ప్రతి లిక్కర్‌ కేస్‌ మూల ధరలో 20శాతం సొమ్మును ముడుపుల రూపంలో వసూలు చేశారు. 2019 నుంచి 24 వరకు ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసిన కంపెనీల లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మిథున్‌రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదు. ముందస్తు బెయిల్‌ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేయండి’ అని అఫిడవిట్‌లో కోరారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో గతేడాది సెప్టెంబరు 23న సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ ఎంపీ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు.. కౌంటర్‌ వేయాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశించింది. సిట్‌ కౌంటర్‌పై గురువారం కోర్టు విచారణ జరుపనుంది.

Updated Date - Jun 12 , 2025 | 04:11 AM