రోత రాతల్ని సహించేది లేదు: మంత్రి అచ్చెన్న
ABN , Publish Date - Jun 15 , 2025 | 06:04 AM
అదేపనిగా ప్రభుత్వంపై, కూటమి పార్టీలపై రోత రాతలు రాస్తే సహించబోమని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన ధరల్లేక కుదేలైన మామిడి రైతుల పరిస్థితులను పరిశీలించారు.

చిత్తూరు సెంట్రల్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): అదేపనిగా ప్రభుత్వంపై, కూటమి పార్టీలపై రోత రాతలు రాస్తే సహించబోమని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన ధరల్లేక కుదేలైన మామిడి రైతుల పరిస్థితులను పరిశీలించారు. మద్దతు ధర అందేలా చూస్తామని వారికి భరోసా ఇచ్చారు. చిత్తూరులో జరిగిన సభలో మాట్లాడారు. గతేడాది జూన్ 12న అధికారం చేపట్టే నాటికి ప్రభుత్వం వెంటిలేటర్పై ఉండేదని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నేర్పుగా ముందుకెళుతున్నారన్నారు. ‘రూ.3 వేల సామాజిక పెన్షన్ రూ.4 వేలకు పెంచాం. పేదవాడి ఆకలి తీర్చేందుకు 170 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి రూ.5కే భోజనం ఇస్తున్నాం. ఎంతమంది స్కూలుకెళ్లే పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం కింద రూ.13 వేలు ఇస్తున్నాం. మిగిలిన రూ.2 వేలు లోకేశ్ఖాతాలో వేసుకున్నారని చెబుతున్న వారిని ఏమనుకోవాలి? విమర్శించిన వారు ధైర్యంగా ముందుకు వచ్చి నిరూపించాలి. అంతేకానీ రోత రాతలు రాస్తే ఊరుకునే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించారు.