Smart Meter: స్మార్ట్ మీటర్లు, చార్జీల పెంపుపై ఉద్యమం
ABN , Publish Date - Jul 01 , 2025 | 06:46 AM
రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపు, అదానీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని వామపక్ష పార్టీలు ప్రకటించాయి.

అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు చార్జీల పెంపు, అదానీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని వామపక్ష పార్టీలు ప్రకటించాయి. వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కలుపుకుని త్వరలోనే కార్యాచరణ రూ పొందించాలని సోమవారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్ణయించాయి. సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయడు పి. ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ తదితరులు హాజరయ్యారు.
నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు ప్రాంతంలో షిర్డిసాయి అనుబంధ ఇండోసోల్ కంపెనీకి భూములను అతి తక్కువ ధరలకే అప్పగించేందుకు చేస్తున్న భూ సమీకరణను వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనకు వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. కరేడులో పర్యటించి స్థానిక రైతులతో మాట్లాడి ప్రత్యక్ష ఆందోళనకు సమాయత్తం కావాలని నిర్ణయించారు. ఈ నెల 9న అఖిల భారత కార్మిక సంఘాలు తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి.