రవిశంకర్ ఎక్కడ?
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:51 AM
మైలవరంలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసి వెళ్లిపోయిన తండ్రి వేములవాడ రవిశంకర్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ కేసులో దర్యాప్తు చేసే కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలిద్దరికీ విషమిచ్చి చంపాలని ముందే రవిశంకర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

పిల్లలతో కలిపి పురుగు మందు తాగినట్టు సమాచారం
పుట్టినరోజే చావు నిర్ణయం.. హోటల్ యజమాని బంధువుకు ఫోన్
ఇంకా తెలియని ఆచూకీ.. ప్రత్యేక బృందాల గాలింపు
బెహరాన నుంచి వచ్చిన చంద్రిక.. కన్నీరుమున్నీరు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : మైలవరంలో ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపేసి వెళ్లిపోయిన తండ్రి వేములవాడ రవిశంకర్ ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ కేసులో దర్యాప్తు చేసే కొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లలిద్దరికీ విషమిచ్చి చంపాలని ముందే రవిశంకర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 8న రవిశంకర్ తన ఇద్దరు పిల్లలు లక్ష్మీ హిరణ్య, లీలసాయికి పురుగు మందు ఇచ్చినట్టు సమాచారం. అదేరోజు రవిశంకర్ పనిచేస్తున్న హోటల్ యజమాని సురేష్ బంధువుకు ఫోన చేశాడు. అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు. వారికిచ్చిన హామీని నెరవేర్చలేకపోతున్నానని ఆవేదన చెందాడు. తాను, పిల్లలిద్దరూ పురుగుల మందు తాగామని చెప్పాడు. నాలుగైదు నిమిషాలు మాట్లాడాక రవిశంకర్ కాల్ కట్ అయ్యింది. ఆ తర్వాత అవతలి వ్యక్తి తిరిగి ఫోన చేసినప్పటికీ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. ఫోన్లో చార్జింగ్ అయిపోయిందని అవతల వ్యక్తి భావించాడు.
అమ్మ పిలిస్తే అనారోగ్యం అన్నాడు
ఈనెల 8న రవిశంకర్ పుట్టినరోజు. దీనికి నాలుగైదు రోజుల ముందు నుంచి అతడు హోటల్లో పనికి వెళ్లడం మానేశాడు. వంట మాస్టర్గా పనిచేస్తున్న అతడు కొంతకాలంగా నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. రెండేళ్ల కిందట రవిశంకర్కు కాళ్లలో నరాలు వాచిపోయాయి. ఆపరేషన చేయించాక ఎక్కువసేపు నిలబడలేకపోయేవాడు. అప్పటికే భార్య చంద్రిక దుబాయిలో పనిచేస్తోంది. ఆపరేషనకు అయిన రూ.2 లక్షలను ఆమె సర్దుబాటు చేసింది. ఆ తర్వాత నరాల నుంచి రక్తస్రావం మొదలైంది. విజయవాడలో చూపించగా, మళ్లీ ఆపరేషన చేయాలని వైద్యులు చెప్పారు. ఈసారి ఆపరేషన చేస్తే నిలబడటం కష్టంగా ఉంటుందని చెప్పారు. దీంతో రవిశంకర్ వెనక్కి తగ్గాడు. పిల్లలను చంపడానికి నాలుగైదు రోజుల ముందు నుంచి అతడు హోటల్లో పనికి వెళ్లడం మానేశాడు. భీమవరంలో భార్య చంద్రికకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని విక్రయించి అప్పులు తీరుస్తానని చెప్పి అక్కడికి వెళ్లాడు. అప్పటికే పిల్లలిద్దరూ భీమవరంలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉన్నారు. రవిశంకర్ ఇంటికి రాకపోవడంతో తండ్రి లక్ష్మీపతి అతడికి ఫోన చేసేవాడు. తాను భీమవరంలో ఉన్నానని, స్థలం అమ్మేసి డబ్బు తీసుకొచ్చి అప్పులు తీరుస్తానని చెప్పాడు. ఈ నెల 6న భీమవరం నుంచి పిల్లలతో సహా మైలవరం వచ్చేశాడు. 8న రవిశంకర్ పుట్టినరోజు కావడంతో తల్లి ఫోన చేసి ఇంటికి రమ్మని చెప్పింది. పిల్లలకు ఆరోగ్యం బాలేదని చెప్పి వెళ్లలేదు. ఆ రోజే పిల్లలను చంపి తాను చనిపోవాలనుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. పిల్లలిద్దరూ ఇంట్లోనే చనిపోవడంతో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. రవిశంకర్ జీవించి ఉన్నాడా, లేదా అనే విషయం ఇప్పటివరకు తెలియలేదు.
ఇబ్రహీంపట్నంలో చివరి లొకేషన్
రవిశంకర్ ఆచూకీ కోసం మైలవరం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. సాంకేతికంగా విచారణ సాగిస్తున్నారు. ఇంట్లో పిల్లలకు విషం ఇచ్చాక అతడు ఇంటి ముందు ఆటో ఎక్కి ఇబ్రహీంపట్నం చేరుకున్నట్టు భావిస్తున్నారు. రవిశంకర్ సెల్ఫోన్ను ట్రాక్ చేయగా, చివరి లొకేషన్ ఇబ్రహీంపట్నం చూపించింది. మైలవరం నుంచి విజయవాడకు అనుసంధానంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా, ఎక్కడా రవిశంకర్ కనిపించలేదు. ఆటోలో వెళ్లిపోవడమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. పోలీసులు ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద, చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. పిల్లలకు విషం ఇచ్చాక భయంతో ఇబ్రహీంపట్నం వచ్చి నదిలో దూకి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
కన్నీరుమున్నీరైన చంద్రిక
తన ఇద్దరు పిల్లల మృతి, భర్త అదృశ్యంతో చంద్రిక కన్నీరుమున్నీరైంది. బెహరూన్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం మైలవరం చేరుకున్న ఆమె ప్రభుత్వాసుపత్రిలో పిల్లల మృతదేహాలను చూసి విలవిల్లాడిపోయింది. తమకు చెప్పుకోదగ్గ అప్పులేమీ లేవని, ఎవరు ఎలాంటి వేధింపులు చేయలేదని చెబుతూ రోదించింది. కాగా, పిల్లల మృతదేహాలకు మైలవరం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం చేయడం కుదరకపోవడంతో శుక్రవారం సాయంత్రం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.