నీరు..పయోగంగా..
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:52 AM
వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకాల మరమ్మతులు రైతుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా అంచనాల రూపకల్పనలో ఆలస్యమవుతోంది. ఫలితంగా ఇంతవరకు నిధులు విడుదల కాక, మరమ్మతులకు నోచుకోక, సాగు చేపట్టాలా లేదా అనే మీమాంసలో ఆయకట్టు అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు. కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లైనా చేయాలని కోరుతున్నారు.

వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకం
17 వేల ఎకరాలకు సాగునీరందించే పథకంపై నిర్లక్ష్యం
సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినా పట్టని అధికారులు
మరమ్మతులకు మూడుసార్లు అంచనాల రూపకల్పన
ఫలితంగా నిధుల విడుదలలో జాప్యం
ఖరీఫ్కు సాగు చేపట్టాలా వద్దా అని రైతుల ఆందోళన
ప్రత్యామ్నాయమైనా చూపాలంటూ వేడుకోలు
నందిగామ, ఆంధ్రజ్యోతి : నందిగామ, జగ్గయ్యపేట నియోజక వర్గాల్లోని 17 వేల ఎకరాలకు నీరందించే వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకాలు వైసీపీ అధికారంలోకి వచ్చే నాటి వరకు సమర్థవంతంగా పనిచేశాయి. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టగా, ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో విస్తరించారు. దాదాపు 130 అడుగుల ఎత్తు వరకూ కృష్ణాజలాలను ఎత్తిపోసి, అక్కడి నుంచి 430 మీటర్ల మేర పైపులైన్ ద్వారా గ్రావెటీపై నీటిని సాగర్ కాల్వకు విడుదల చేశారు. 2,300 అశ్వసామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లతో ఈ పథకం పూర్తి ఆయకట్టుకు సునాయాసంగా నీరందించింది. గతంలో టీడీపీ హయాంలో జలవనరుల శాఖా మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావు భారీగా నిధులందించి పూర్తిస్థాయి మరమ్మతులు చేయించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పాలకులు నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఐదేళ్లుగా ఈ పథకం మూలకు చేరింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నదాతల ఆశలు చిగురించాయి. మరమ్మతులు చేయిస్తారన్న వారి కలలు ఇంతవరకు నెరవేరలేదు. ఏడాదిగా నిధుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అవి అందకపోవడంతో సాగు చేపట్టాలా, లేదా అని యోచిస్తున్నారు.
భరోసా ఇస్తారా?
గత ఏడాది ఖరీఫ్ నాటికి కూటమి ప్రభుత్వం కొలువుతీరింది. దీంతో కచ్చితంగా మరమ్మతులు చేస్తారన్న నమ్మకంతో ఆయకట్టులో అన్నదాతలు సాగు చేపట్టారు. వాణిజ్య, ఆహార పంటలు చేపట్టారు. కానీ, ఈ పథకం మరమ్మతులకు నిధులు అందలేదు. దీంతో నీటి కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు తెలంగాణాలోని సీఎం ట్యాంక్ నుంచి దిగువకు రావాల్సిన సాగర్ నీరు కూడా పూర్తిస్థాయిలో అందలేదు. ఫలితంగా పంటలు ఎండిపోయాయి. మిర్చి, మొక్కజొన్న, మాగాణి పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఆ చేదు అనుభవాల నడుమ తిరిగి ఖరీఫ్ ప్రారంభమైంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఆదేశించినా పనులు ముందుకు సాగకపోవడంపై ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకాలకు చెందిన 2,300 అశ్వసామర్థ్యం కలిగిన మోటార్లు కొనాలంటే ముందుగా ఆర్డర్ ఇవ్వాలి. ఆ తర్వాతే మోటార్ల తయారీ ప్రారంభమవుతుంది. ఇందుకు 3 నెలల సమయం పడుతుంది. నిధులు మంజూరై, మోటార్లకు ఆర్డర్ ఇస్తే అన్నదాతలు ధైర్యంగా ముందడుగు వేస్తారు. మోటార్లు వచ్చే వరకూ వర్షపు నీటితో పాటు అరకొరగా వచ్చే సాగర్ నీటిని సర్దుకుని సాగు చేపడతారు. వర్షాలు తగ్గే నాటికి మోటార్లు బిగించి నీటిని విడుదల చేసినా సాగుకు సరిపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం త్వరగా నిధులు కేటాయించి మరమ్మతులు ప్రారంభిస్తుందని స్థానిక రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి శాసనసభ సమావేశంలోనే నందిగామ ఎమ్మెల్యే సౌమ్య.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ సమస్యను వివరించారు. మరమ్మతులకు నిధులు అందించాలని కోరగా, సంబంధిత మంత్రిని కలవాలని ఆయన సూచించారు. ఆ తర్వాత జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్తో కలిసి సౌమ్య.. మంత్రి నిమ్మల రామానాయుడికి వినతిపత్రం అందజేశారు. ఏప్రిల్ 5న ముప్పాళ్ల వచ్చిన చంద్రబాబుకు కూడా వినతి పత్రం ఇచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే నిధులు విడుదల చేసి ఖరీఫ్కు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే, అంచనాలు రూపొందించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. మరమ్మతుల అంచనాల రూపకల్పనలో అధికారుల తడబాటు.. నిధుల విడుదల జాప్యానికి కారణమైంది. స్థానిక అధికారులు రూపొందించిన అంచనాలపై ఉన్నతాధికారులు రిమార్కులు పెట్టడం, వాటిని సరిచేసి స్థానిక అధికారులు తిరిగి పంపడం జరుగుతోంది. ఇప్పటికే మూడుసార్లు ఇలా జరిగింది. ఈసారైనా అధికారులు, పాలకులు దృష్టిసారించి ఖరీఫ్కు వేదాద్రి, కంచల పథకాలను సిద్ధం చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలి
వేదాద్రి, కంచల ఎత్తిపోతల పథకాల మరమ్మతులు ఆలస్యమవుతున్న ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఈ పథకాల నీటిని భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి చెర్వుమాధవరం ట్యాంక్ నుంచి ఆ మేర నీటిని విడుదల చేయించాలి. కానీ హక్కుగా రావాల్సిన వాటాలు ఇచ్చేందుకే తెలంగాణ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్న సమయంలో అదనపు నీటి విడుదల సాధ్యమవుతుందా.. అనే అనుమానాలు కూడా ఉన్నాయి.