బడిగంట మోగింది
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:03 AM
40 రోజుల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజే విద్యార్థులు అధిక సంఖ్యలో పాఠశాలలకు తరలివచ్చారు. అలాగే, బదిలీలు, పదోన్నతుల అనంతరం వివిధ పాఠశాలలకు నూతన ఉపాధ్యాయులు వచ్చారు.

జిల్లావ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం
విద్యార్థులకు కిట్లు, పాఠ్యపుస్తకాల పంపిణీ
మచిలీపట్నం టౌన్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి) : 40 రోజుల వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. తొలిరోజే విద్యార్థులు అధిక సంఖ్యలో పాఠశాలలకు తరలివచ్చారు. అలాగే, బదిలీలు, పదోన్నతుల అనంతరం వివిధ పాఠశాలలకు నూతన ఉపాధ్యాయులు వచ్చారు. కాగా, ఆర్జేడీ నాగమణి, డీఈవో రామారావు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లోని పాఠశాలల్లో గురువారం విద్యార్థులకు కిట్లు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. మొదటిరోజు విద్యార్థులు పరుగుపరుగున వచ్చారు. క్యాంపుబెల్పేటలోని యూపీ పాఠశాలలో ఎంఈవో ఎం.దుర్గాప్రసాద్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో తొలిరోజు 80 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు విద్యాశాఖాధికారులు తెలిపారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, షూ అందజేశారు. విద్యార్థులకు అందజేసే కిట్లను మండల విద్యాశాఖాధికారుల ద్వారా పాఠశాలలకు పంపుతున్నారు. ఈ కిట్లు పూర్తిస్థాయిలో చేరుకున్నాక పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పాఠ్య, నోట్ పుస్తకాలు పూర్తిస్థాయిలో చేరుకున్నందున విద్యార్థులకు వాటిని పంపిణీ చేశారు. జిల్లాలో సుమారు 1,000 కిపైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇంకా కొన్ని పాఠశాలలకు యూనిఫాం, షూ చేరలేదు. ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతున్నాయి. కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరాక మొత్తం సర్దుబాటు చేసి విద్యార్థులకు ఒక్కొక్కటిగా అందజేయాలని అధికారులు భావిస్తున్నారు.