నెట్టెంకు పట్టం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:25 AM
కృష్ణాజిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్గా విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అధిష్ఠానం నుంచి సోమవారం ఆయనకు సమాచారం అందటంతో నెట్టెం మంగళగిరిలోని కార్యాలయానికి వెళ్లారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివాదాలకు దూరంగా ఉండటం, సమర్థనీయతతో పాటు ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి కావడం, చంద్రబాబుతో ఉన్న అనుబంధం, గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాకు విజయం చేకూర్చడంలో కీలకపాత్ర పోషించినందుకే నెట్టెంను ఈ పదవి వరించింది.

కేడీసీసీ బ్యాంకు చైర్మన్గా నెట్టెం రఘురాం నియామకం
జగ్గయ్యపేట శ్రేణుల్లో ఆనందోత్సాహాలు
జగ్గయ్యపేట, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి) : కృష్ణాజిల్లా సహకార కేంద్రబ్యాంకు చైర్మన్గా విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాంను నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అధిష్ఠానం నుంచి సోమవారం ఆయనకు సమాచారం అందటంతో నెట్టెం మంగళగిరిలోని కార్యాలయానికి వెళ్లారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, వివాదాలకు దూరంగా ఉండటం, సమర్థనీయతతో పాటు ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి కావడం, చంద్రబాబుతో ఉన్న అనుబంధం, గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణాజిల్లాకు విజయం చేకూర్చడంలో కీలకపాత్ర పోషించినందుకే నెట్టెంను ఈ పదవి వరించింది.
ఆవిర్భావం నుంచి టీడీపీలోనే..
టీడీపీ ఆవిర్భావం నుంచి నెట్టెం రఘురాం సేవలందిస్తున్నారు. ఎల్ఎంబీ బ్యాంకు డైరెక్టర్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1985లో జగ్గయ్యపేట నుంచి పిన్న వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ ప్రభంజనంలోనూ విజయం సాధించా రు. 1994లో వరుసగా మూడుసార్లు విజయం సాధించి జగ్గయ్యపేట నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సాధించారు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న జగ్గయ్యపేటలో టీడీపీకి గట్టి పునాది వేశారు. 1996లో కొంతకాలం మద్యనిషేధ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. జగ్గయ్యపేట నుంచి తొలిసారి కేబినెట్లో చోటు దక్కించుకున్న నేతగా రికార్డు సాధించారు. 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన ఆయన.. ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను రంగంలోకి దింపారు. 2014 ఎన్నికల్లో తాతయ్య విజయానికి కృషి చేశారు. 2019 ఎన్నికల తర్వాత విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నెట్టెం బాధ్యతలు చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేశారు. 2024 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల్లో కూటమికి తిరుగులేని ఆధిక్యం లభించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇస్తారని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా చంద్రబాబు కేడీసీసీ బ్యాంకు పదవికి నెట్టెం పేరును ప్రకటించారు. కేబినెట్ హోదా కలిగిన ఆప్కాబ్ చైర్మన్గా చేస్తానని కూడా చంద్రబాబు ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
జగ్గయ్యపేట నుంచి మూడో నేతగా..
ఇంతకుముందు జగ్గయ్యపేట నుంచి కేడీసీసీ బ్యాంకు చైర్మన్గా నెట్టెం రఘురాం బావ తొండెపు దశరథ జనార్ధన్ ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఆప్కాబ్ చైర్మన్గా, నాప్కాబ్ వైస్ చైర్మన్గా జాతీయ స్థాయిలో పనిచేశారు. అనంతరం వైసీపీ హయాంలో జగ్గయ్యపేట నుంచి తన్నీరు నాగేశ్వరరావు ఏడాదిపాటు కేడీసీసీ బ్యాంకు చైర్మన్గా పనిచేశారు. ఇప్పుడు తిరిగి ఇదే నియోజకవర్గం నుంచి నెట్టెంకు అవకాశం లభించడం విశేషం.
జగ్గయ్యపేటలో ఆనందోత్సాహాలు
నెట్టెం రఘురాంకు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ పదవి ఇవ్వడంతో జగ్గయ్యపేట నియోజకవర్గంలోని టీడీపీ శ్రే ణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. రఘురాంకు సముచిత స్థానం కల్పించాలని నియోజకవర్గ పార్టీ అనేకసార్లు ఏక గ్రీవ తీర్మానాలు కూడా చేసింది.