Share News

అభివందనం

ABN , Publish Date - Jun 14 , 2025 | 12:49 AM

అమ్మ కళ్లలో ఆనందం కనిపించింది. విద్యార్థులు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. కూటమి సర్కారు కొలువు తీరిఏడాదైన సందర్భంగా ‘తల్లికి వందనం’ నిధులను జమ చేశారు. ఆ డబ్బు గురువారం సాయంత్రం నుంచి తల్లుల ఖాతాల్లో పడటం మొదలవడంతో అంతటా తల్లికి వందనం సంబరాలు చేసుకుంటున్నారు. ముగ్గురు, నలుగురు పిల్లలున్న తల్లుల ఖాతాల్లో కూడా రూ.39 వేలు, రూ.52 వేలు జమ అవుతుండటంతో రెండు జిల్లాల్లో ఎక్కడచూసినా ఇదే చర్చ జరుగుతోంది.

అభివందనం
విజయవాడలో తమ ఫోన్‌కు వచ్చిన బ్యాంక్‌ మెసేజ్‌ను చూపిస్తున్న ఓ తల్లి

రెండు జిల్లాల్లో తల్లికి వందనం సంబరాలు

అర్హులైన వారి ఖాతాల్లో డబ్బు జమ మొదలు

ఎన్టీఆర్‌ జిల్లాలో 1,41,990 మంది తల్లులు.. రూ.210 కోట్ల లబ్ధి

కృష్ణాజిల్లాలో 1,11,458 మంది తల్లులు.. రూ.175 కోట్ల లబ్ధి

ఉదయం నుంచి తల్లుల ఫోన్లకు క్రెడిట్‌ మెసేజ్‌లు

ముగ్గురు, నలుగురు పిల్లలున్న వారికి భారీ ప్రయోజనం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/మచిలీపట్నం) : తల్లికి వందనం పథకం డబ్బు శుక్రవారం నుంచి జమ అవుతుండటంతో కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం 2,13,846 మంది విద్యార్థులు ఈ పథకానికి ఎంపిక కాగా, 1,41,990 మంది తల్లులను లబ్ధిదారులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ కలిపి రూ.210 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది. కృష్ణాజిల్లాలో 1,70,963 మంది విద్యార్థులు అర్హత సాధించగా, 1,11,458 మంది తల్లుల ఖాతాల్లో రూ.175 కోట్ల మేర ప్రభుత్వం జమ చేయనుంది.

తల్లుల ఖాతాలకు డబ్బు జమ

లబ్ధిదారుల జాబితాలను విద్యాశాఖ అధికారులు గురువారమే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వానికి పంపారు. ఈ జాబితాల ఆధారంగా ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే, అందరికీ తల్లికి వందనం నగదు జమ అవుతుంది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి తల్లులు ఖాతాల్లో నగదు జమ అవుతూ వస్తోంది. డబ్బు క్రెడిట్‌ అయినట్టుగా కొందరికి మెసేజ్‌లు కూడా వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు, వారి తల్లుల ఆధార్‌కార్డు నెంబర్లు బ్యాంకు ఖాతాల నెంబర్లకు అనుసంధానం కాకపోవడం, కొందరి పేర్లు ఎక్కువసార్లు నమోదు కావడం వంటి సమస్యలు తలెత్తాయి. ఇలాంటి వారికి డబ్బు జమ కాలేదు. వీటిని సరిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వాటిని సరిచేసే పనిలో ఎంఈవోలు, సచివాలయ సిబ్బంది బిజీగా ఉన్నారు. అర్హులైన తల్లులు కొందరు తమకు మెసేజ్‌లు రాకపోవటంతో ఆందోళన చెందారు. అయితే, అర్హులైన వారందరికీ నగదు జమ అవుతుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఎంఈవోలు స్పష్టం చేస్తున్నారు.

ముగ్గురు, నలుగురు పిల్లలున్న వారికి లబ్ధి

ముగ్గురు, నలుగురు పిల్లలున్న కుటుంబాలకు భారీగా లబ్ధి కలిగింది. ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.39 వేలు, నలుగురుంటే రూ.52 వేలు జమ అయ్యాయి. చందర్లపాడు మండలంలోని ఏటూరు, వెలదికొత్తపాలెం గ్రామాల్లో నలుగురు చొప్పున పిల్లలను చదివిస్తున్న తల్లులకు రూ.52 వేల వరకు జమ అయ్యింది. పేదరికంలో ఉన్నా.. పిల్లలను చదివించాలన్న ఆకాంక్ష ఉన్న తల్లులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

  • చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన జూపల్లి కవితకు నలుగురు పిల్లలు. ఆమె భర్త రమేశ్‌ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఆమె తన పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు సిద్ధు స్థానిక జిల్లా పరిషత పాఠశాలలో ఏడో తరగతి చదువుతుండగా, కవల పిల్లలైన లక్కీ, రాజులు ఎంపీపీ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నారు. చివరి కుమారుడు తేజ నాల్గో తరగతి చదువుతున్నాడు. ఈ నలుగురు పిల్లలు కూడా తల్లికి వందనం పథకం కింద ఎంపిక కావటంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్థిక సాయం ద్వారా తమ పిల్లలను మరింత సమర్థవంతంగా చదివించుకుంటానని కవిత ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలని తన భర్త కలలు కనేవాడని, ఆయన మరణంతో పిల్లల భవిష్యత్తును తలచుకుని భయపడుతున్న తరుణంలో తల్లికి వందనం కింద తాను ఎంపికైనందుకు ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

  • చందర్లపాడు మండలానికి చెందిన కలితిరిపి వాణీకి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. భర్త వెంకటేశ్‌ మృతిచెందాడు. పిల్లల్ని చదివించాలన్న పట్టుదలతో వారిని చదివించుకుంటోంది. వారిని చదివించుకోవటం కష్టంగా మారినా వాటన్నింటినీ భరిస్తూ ఆమె తన పిల్లలను చదివిస్తున్నారు. పెద్ద అమ్మాయి రమ్యశ్రీ జిల్లా పరిషత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కుమారుడు వెంకటరమణ ఆరు, ధాత్రిశ్రీ నాల్గో తరగతి చదువుతుండగా, బాలాజీ రెండో తరగతి చదువుతున్నారు. ఈ పిల్లలు తల్లికి వందనం పథకానికి ఎంపిక కావడంతో వాణి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం తన పిల్లల విద్యాభివృద్ధికి సాయం చేయడం అభినందనీయమన్నారు.

  • వైసీపీ కార్యకర్త ఆనందం.. తల్లికి వందనం జమతో వాట్సాప్‌ స్టేటస్‌

    మైలవరం టౌన్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా తల్లికి వందనం డబ్బు జమ కావడంతో ఓ వైసీపీ కార్యకర్త ఆనందం వ్యక్తం చేశాడు. మండలంలోని పొందుగల గ్రామానికి చెందిన పుల్లురు రమేశ్‌ తన పిల్లల డబ్బు జమ కావడంతో ఆనందంతో ఫోన్‌లో వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకున్నాడు.

Updated Date - Jun 14 , 2025 | 12:49 AM