ఎండీయూ వాహనాలు ఫర్ సేల్
ABN , Publish Date - Jun 13 , 2025 | 01:08 AM
ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన పలువురు మొబైల్ డిస్బర్స్మెంట్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లు ఆ వాహనాలను అమ్మకానికి పెట్టారు. సెకండ్హ్యాండ్ వస్తువుల సేల్స్ నిర్వహించే ఓఎల్ఎక్స్ ఆన్లైన్ ప్లాట్ఫాంలో సెకండ్ సేల్స్ కింద వీటిని విక్రయిస్తున్నారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన వాహనాలు ఓఎల్ఎక్స్లో ప్రత్యక్షం
రూ.3-4 లక్షలకు పోస్టులు పెడుతున్న ఎండీయూ ఆపరేటర్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన పలువురు మొబైల్ డిస్బర్స్మెంట్ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లు ఆ వాహనాలను అమ్మకానికి పెట్టారు. సెకండ్హ్యాండ్ వస్తువుల సేల్స్ నిర్వహించే ఓఎల్ఎక్స్ ఆన్లైన్ ప్లాట్ఫాంలో సెకండ్ సేల్స్ కింద వీటిని విక్రయిస్తున్నారు. ఓఎల్ఎక్స్ వెబ్సైట్, మొబైల్ యాప్స్లో ఫ్రీ రిజిస్ర్టేషన్ చేసుకుని ఉచిత యాడ్స్ పోస్ట్ చేసే అవకాశాన్ని ఉపయోగించుకుని మరీ అమ్మకానికి పెడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎండీయూ ఆపరేటర్లు ఇప్పటికే ఓఎల్ఎక్స్లో పోస్ట్ చేశారు. ఒక వాహనాన్ని రూ.3 లక్షల సేల్తో పోస్ట్ చేయడం గమనార్హం.
ప్రభుత్వ ఆదేశాలు లేకుండా..
కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా డోర్ డెలివరీని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వాహనాలను ఎండీయూ ఆపరేటర్లకే ఇచ్చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. గతంలో వారు తీసుకున్న రుణాన్ని కూడా ప్రభుత్వమే చెల్లించాలన్న ఆలోచన కూడా చేస్తోంది. కానీ, ప్రభుత్వం సర్క్యులర్ ఇవ్వకుండా ఇలా వాహనాలను విక్రయించవచ్చా లేదా అన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ప్రభుత్వం రుణాన్ని చెల్లిస్తానంటోంది కాబట్టి.. ఆ వాహనాలన్నీ ఎండీయూ ఆపరేటర్ల సొంతమవుతాయి. కాబట్టి ఆ వాహనాలను వారేమైనా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, ప్రభుత్వ ఆదేశాలు లేకుండా వాటి విక్రయాలు జరిగితే కొనుగోలు చేసిన వారికి రిజిస్ర్టేషన్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.