Operation Sindoor: ఆర్మీకి విరాళాల వెల్లువ.. నెల జీతం ఇచ్చిన ఏపీ స్పీకర్
ABN , Publish Date - May 10 , 2025 | 01:57 PM
AP Speaker Donation: యుద్ధంలో ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తమ వంతు సాయంగా జాతీయ రక్షణ నిధికి విరాళాలు అందజేస్తున్నారు.

అమరావతి, మే 10: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఆర్మీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సైనికులకు తమ వంతు సహాయం అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు తమ నెల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (AP Speaker Ayyannapatrudu) తన నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఈ విరాళాన్ని స్పీకర్ అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. దేశ సాయుధ దళాలు ఉగ్రవాద నిర్మూలనలో చూపిస్తున్న ధైర్యం ప్రతీ భారతీయునికి గర్వకారణమన్నారు.
దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జవాన్లకు తన వంతు సంఘీభావంగా, సైనికులకు బాసటగా తన నెల జీతం రూ.2,17,000/ జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేసినట్లు తెలిపారు. దేశ భద్రత కోసం సాయుధ దళాలు చేస్తున్న కృషి దేశ ప్రజలందరిలో జాతీయభావనను పెంపొందించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
Operation Sindoor: పాక్ సైన్యం సరిహద్దుల దిశగా కదులుతోంది.. కల్నల్ సోఫియా ఖురేషీ
జవాన్ల కోసం ప్రత్యేక పూజలు
మరోవైపు ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని.. ఇండియన్ ఆర్మీ క్షేమంగా ఉండాలంటూ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దేవాలయాల్లో ఆర్మీ కోసం రాజకీయ నేతలు పూజలు చేస్తున్నారు. విశాఖలోని మురళినగర్లో ఉన్న వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ప్రత్యేక పూజలు చేశారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, భారత సైనికులు, ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో ఉన్న సైనికులకు శారీరక శక్తితో పాటు మనోధైర్యం ఇవ్వాలని ప్రత్యేక పూజలు చేశామన్నారు. భారత్ ఉగ్రవాదులపై దాడులు చేస్తుంటే పాకిస్థాన్ మన దేశ పౌరులపై దాడులు చేయడం అత్యంత హేయమని మండిపడ్డారు. ముష్కరులపై యుద్ధంలో భారత్ విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.
భారత్ విశ్వగురువుగా మారాలి: పాకా సత్యనారాయణ
ప్రధాని మోదీకి, వారి మంత్రివర్గానికి, సైన్యానికి ఖచ్చితమైన విజయం చేకూరాలని భీమవరం దేవాలయాల్లో పూజలు చేశామని ఎంపీ పాకా సత్యనారాయణ తెలిపారు. తీవ్రవాదాన్ని అణిచే ధర్మపోరాటంలో భారత్ తరఫున ప్రపంచం మద్దతు తెలుపుతుందన్నారు. ఆధ్యాత్మిక శక్తి, దైవ బలం భారత్కు అందాలన్నారు. ముష్కరులు అంతా ఈ యుద్ధంలో నేలమట్టమై వారి స్థితి గతులు మారిపోవాలని తెలిపారు. ఈ ధర్మ యుద్ధంలో భారత్ విశ్వగురువుగా నిలబడాలని ఎంపీ పాకా సత్యనారాయణ ఆకాంక్షించారు.
కడప జిల్లాలోని గండి ఆంజనేయస్వామి ఆలయంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్లు, బీజేపీ నాయకులు, ప్రజలు పూజలు చేశారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పో యిన వీరజవాన్ల కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని పూజలు చేశారు. పాకిస్థాన్తో తలపడుతున్న జవాన్లకు శక్తినివ్వాలని రిటైర్డ్ ఆర్మీ జవాన్లు ప్రత్యేక పూజలు చేశారు. యుద్ధంలో పాల్గొనడానికి మాజీ సైనికుల అవసరం వస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని రిటైర్డ్ జవాన్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: భారత్-పాక్ యుద్ధం.. ఢిల్లీకి తెలుగు స్టూడెంట్స్
Operation Sindoor: ఇండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు.. తుస్సుమంటున్న పాక్ మిస్సైల్స్..
Read Latest AP News And Telugu News