Share News

AP Police: కొమ్మినేని అరెస్టు

ABN , Publish Date - Jun 10 , 2025 | 03:12 AM

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని జగన్‌ చానల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టుచేశారు. ప్రధాన నిందితుడు, ఎనలిస్టు కృష్ణంరాజు మాత్రం ఇంటికి తాళాలు వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

AP Police: కొమ్మినేని అరెస్టు

  • పరారీలో ఎనలిస్టు కృష్ణంరాజు

  • అమరావతిని వేశ్యల రాజధానిగా చిత్రించడంపై

  • దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష ఫిర్యాదు

  • తుళ్లూరు స్టేషన్‌లో వారిద్దరితోపాటు

  • సాక్షి యాజమాన్యంపై కేసు నమోదు

  • ఉదయాన్నే హైదరాబాద్‌లో కొమ్మినేనిని

  • అదుపులోకి తీసుకున్న తుళ్లూరు పోలీసులు

  • రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోనే

  • అనంతరం నల్లపాడు స్టేషన్‌కు తరలింపు

గుంటూరు, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అని జగన్‌ చానల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసులో యాంకర్‌ కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టుచేశారు. ప్రధాన నిందితుడు, ఎనలిస్టు కృష్ణంరాజు మాత్రం ఇంటికి తాళాలు వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం పోలీసు బృందాలు పెద్దఎత్తున గాలిస్తున్నాయి. ఇటీవల జగన్‌ చానల్లో యాంకర్‌ కొమ్మినేని నిర్వహించిన లైవ్‌ డిబేట్లో.. అమరావతి దేవతల రాజధాని కాదు... వేశ్యల రాజధాని అని కృష్ణంరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొమ్మినేని ఆయన్ను వారించకుండా చర్చను కొనసాగించారు. దీనిపై రాజధాని ప్రాంతం సహా రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబుకాయి. మహిళలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నా.. ఆ ఇద్దరు గానీ, సాక్షి యాజమాన్యం గానీ కనీసం క్షమాపణలు చెప్పకపోవడంతో వారు మండిపడుతున్నారు. ఈ క్రమంలో రాజధాని ప్రాంత దళిత జేఏసీ నాయకురాలు కంభంపాటి శిరీష తుళ్లూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కృష్ణంరాజు, కొమ్మినేని, సాక్షి యాజమాన్యంపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పలు నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఉదయం తుళ్లూరు పోలీసులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని జర్నలిస్టుల కాలనీకి వెళ్లి కొమ్మినేని నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్లో హాజరుపరిచి.. అక్కడి నుంచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై సోమవారం రాత్రికి విజయవాడ తీసుకొచ్చారు. తొలుత రాజధానిలోని తుళ్లూరు పోలీసు స్టేషన్‌కు గానీ.. లేదంటే గుంటూరు గానీ తీసుకురావాలని భావించారు. అయితే ఈ ప్రాంతంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న మహిళలు ప్రతిఘటించవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో పోలీసులు విజయవాడలోనే ఆయన్ను రహస్య ప్రాంతంలో ఉంచారు. రాత్రి పొద్దుపోయాక నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మంగళవారం ఉద యం మంగళగిరి కోర్టులో హాజరుపరుస్తారని అంటున్నారు.


మూడ్రోజుల కిందటే కృష్ణంరాజు పరార్‌!

అమరావతిపై తన వ్యాఖ్యలకు మహిళలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రధాన నిందితుడైన కృష్ణంరాజు మూడ్రోజుల కిందటే విజయవాడలోని తన ఇంటికి తాళం వేసి కుటుంబంతోపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీ కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. వేరే రాష్ట్రానికి వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలోనే కృష్ణంరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామంటున్నారు.

నిరసనలు, ఫిర్యాదుల వెల్లువ..

మరోవైపు జగన్‌ మీడియా తీరుపై రాష్ట్రవ్యాప్తంగా మహిళల నిరసనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. జగన్‌ పత్రిక కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 60కి పైగా పోలీసు స్టేషన్లలో మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు కృష్ణంరాజు, కొమ్మినేని, సాక్షి యాజమాన్యంపై పెద్దఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు పోలీసు స్టేషన్లో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇందులో ఏ-1గా కృష్ణంరాజు, ఏ-2గా కొమ్మినేని శ్రీనివాసరావు, ఏ-3గా సాక్షి యాజమాన్యాన్ని చేర్చారు.

నల్లపాడు స్టేషన్‌ వద్ద వైసీపీ నేతల హల్‌చల్‌

కొమ్మినేనిని నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారని తెలుసుకున్న వైసీపీ లీగల్‌ సెల్‌ బృందం రాత్రి 11:10 గంటల సమయంలో అక్కడకు వచ్చారు. అప్పటికే అక్కడ పోలీసులు నిషేధాజ్ఞలు అమల్లోకి తెచ్చారు. మీడియాను సైతం లోపలకు అనుమతించలేదు. దీంతో లీగల్‌ సెల్‌ న్యాయవాదులు పోలీసులపై తిరగబడ్డారు. కేసులో నిందితుడిని కలిసే హక్కు తమకుందని, ఎలా ఆపుతారంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని గేటు వద్దే అడ్డుకున్నారు. ఒక్కరినే అనుమతిస్తామని చెప్పడంతో వైసీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి లోపలకు వెళ్లి సంతకాలు చేయించుకుని వచ్చారు. స్టేషన్‌ వద్దకు వచ్చినవారిలో మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి, పోలూరి వెంకటరెడ్డి, పలువురు న్యాయవాదులు ఉన్నారు. కాగా.. కొమ్మినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవడంతో డీఎస్పీ మురళీకృష్ణ ఆయన్ను సుదీర్ఘంగా విచారించారు.

Updated Date - Jun 10 , 2025 | 03:16 AM