Kakani Tollgate Scam: కాకాణి టోల్ పాపం బద్దలు
ABN , Publish Date - Jun 11 , 2025 | 03:54 AM
సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పాపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారంలో ఉండగా.. తన నియోజకవర్గం పరిధిలోని కృష్ణపట్నం పోర్టులో అనధికార టోల్ గేటు పెట్టి కోట్లు వసూలుచేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.

కృష్ణపట్నం పోర్టులో రూ.40 కోట్ల వసూళ్ల దందా
లారీల అసోసియేషన్ను డమ్మీచేసి సొంతగా లాజిస్టిక్స్ కంపెనీ
భారీగా ముందే అద్దె వసూలు.. పోర్టు బయట ఏకంగా ప్రైవేటు టోల్గేటు
వాహనదారుల నుంచి కమీషన్లు.. ఆ తర్వాత బాడుగలో 4శాతం బాదుడు
ఈ భారం భరించలేక చెన్నై పోర్టుకు తరలిపోయిన కంపెనీలు
ఈ నెల 6న వాహనదారు ఫిర్యాదు.. కాకాణి, 10 మందిపై కేసు
‘టోల్గేట్’ బద్దలైంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆయన అనుచరగణం సాగించిన అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. పోర్టును ఆదాయ వనరుగా మార్చుకుని బహిరంగ వసూళ్లకు దిగిన విషయం బయటపడింది. వాహనాల రవాణాను చేజిక్కించుకుని.. అనధికార టోల్గేట్తో ఐదేళ్లలో రూ.40 కోట్ల వరకు పిండుకున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. కాకాణి, ఆయన అనుచరుల నిర్వాకాలతో ఎగుమతి-దిగుమతుల కంపెనీలు చెన్నై పోర్టుకు తరలిపోయాయి. దీంతో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కంటైనర్ టెర్మినల్ను ఎత్తివేసింది.
(నెల్లూరు-ఆంధ్రజ్యోతి)
సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పాపాలు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. అధికారంలో ఉండగా.. తన నియోజకవర్గం పరిధిలోని కృష్ణపట్నం పోర్టులో అనధికార టోల్ గేటు పెట్టి కోట్లు వసూలుచేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. కృష్ణపట్నం పోర్టు నుంచి సరుకు ఎగుమతులు, దిగుమతుల కోసం రోజూ కొన్ని వందల వాహనాలు వచ్చి పోతుంటాయి. వీటి నిర్వహణ కోసం ట్రాన్స్పోర్టర్లు ‘కృష్ణపట్నం లారీ ట్రాన్స్పోర్టు వెల్ఫేర్ అసోసియేషన్’ ఏర్పాటు చేసుకున్నారు. పోర్టు ఆరంభం నుంచీ ఇది నడుస్తోంది. 2019 వరకు దీనిపై రాజకీయ పెత్తనం లేదు. అసోసియేషన్ సంక్షేమం కోసం నామమాత్రంగా టోల్ ఫీజు వసూళ్లు చేసేవారు. ఆ లెక్కలు పక్కాగా నిర్వహించేవారు. 2019లో వైసీపీ ప్రభుత్వం రావడం, కాకాణి సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేగా రెండోసారి గెలువడంతో అక్రమ ఆదాయం కోసం వైసీపీ నేతలు ఈ పోర్టుపై కన్నేశారు. తొలుత లారీ అసోసియేషన్లోకి చొరబడ్డారు. పాత పాలకవర్గం నుంచి లాక్కుని.. అనుబంధంగా కృష్ణపట్నం లాజిస్టిక్స్ అనే కంపెనీ ఏర్పాటు చేశారు. పాత అసోసియేషన్ను డమ్మీ చేసి మొత్తం రవాణాను చేజిక్కించుకున్నారు. పోర్టు గుండా విదేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకునే కంపెనీలు 60కి పైగా ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ పోర్టు లోపలే కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని దిగుమతి, ఎగుమతి వ్యవహారాలు చూసుకుంటాయి. కాకాణి అనుచరులు వాటిపై పెత్తనం చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఈ కంపెనీలు తమకు అవసరమైన ట్రాన్స్పోర్టు వాహనాలను సమకూర్చే కాంట్రాక్టును కృష్ణపట్నం లారీ అసోసియేషన్కు ఇచ్చేవి. ఆ సంఘం వాహనాలను సమకూర్చేది. అయితే ఈ కాంట్రాక్టులను వైసీపీ నాయకులు తాము ఏర్పాటు చేసుకున్న కృష్ణపట్నం లాజిస్టిక్స్ కంపెనీకి ఇవ్వాలని హుకుం జారీ చేశారు. వీరిని కాదంటే సరుకు ఎగుమతి, దిగుమతులకు వాహనాలు పోర్టులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయా కంపెనీలు విధిలేక సరుకు రవాణా కాంట్రాక్టును వీరికే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాజిస్టిక్స్ కంపెనీ పేరుతో పోర్టుకు వెలుపల పంటపాళెం వద్ద అనధికారిక టోల్గేట్ ఏర్పాటు చేశారు. పోర్టు నుంచి ఎగుమతి, దిగుమతుల కోసం వాహనాలను కేటాయించే క్రమంలో వాహనదారుల నుంచి భారీ మొత్తంలో కమీషన్ గుంజారు. బాడుగకు బండి పెట్టాలంటే రూ.5 వేల నుంచి 7 వేల వరకు వసూలు చేశారు. కొద్ది రోజులకు కమీషన్ను పర్సంటేజ్ కింద మార్చారు. బాడుగ మొత్తంలో 4 శాతం వసూలు చేశారు. కంటైనర్లను మోసుకెళ్లే భారీ ట్రక్కుల బాడుగను బరువును బట్టి, దూరాన్ని బట్టి లక్షల్లో నిర్ణయించారు. ఆ బాడుగ మొత్తంలో 4 శాతం అంటే.. ఒక్కో ట్రిప్పునకు 10 వేల నుంచి 20 వేల వరకు వైసీపీ నాయకులకు ముట్టజెప్పాల్సి వచ్చేది.
కంటైనర్ టెర్మినల్ ఎత్తివేయడానికి..
కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ ఎత్తివేయడానికి, వేల మంది కార్మికులు వీధిన పడడానికి ప్రధాన కారణాల్లో వైసీపీ నాయకుల అక్రమ దందా కూడా ఒకటని పోర్టు ఉద్యోగుల వాదన. ఎప్పుడైతే ఎగుమతి, దిగుమతి కంపెనీలకు వాహనాల అద్దెను విపరీతంగా పెంచారో.. అవి భరించలేక తమ కార్యకలాపాలకు చెన్నై పోర్టుపై ఆధారపడడం మొదలుపెట్టాయి. ఫలితంగా కృష్ణపట్నం పోర్టుకు వచ్చే కంటైనర్ల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది. దీంతో కంటైనర్ టెర్మినల్ లాభసాటిగా లేదని పోర్టు యాజమాన్యం దీనిని ఎత్తివేసింది. కేవలం బొగ్గు, బూడిద దిగుమతి, ఎగుమతుల టెర్మినల్గా మార్చేసింది. దీంతో కృష్ణపట్నం పోర్టుపై ఆధారపడిన వందలాది ట్రాన్స్పోర్టు కంపెనీలు ఉపాధి కోల్పోయాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రావడం.. కాకాణి ఓడిపోవడంతో దందా ఆగిపోయింది. అయితే వైసీపీ నాయకుల అక్రమ వసూళ్ల కారణంగా నష్టపోయిన ట్రాన్స్పోర్టర్ షేక్ ఫరీద్ అనే వ్యక్తి.. వారి అరాచకాలపై పోలీసులకు ఈ నెల 6న ఫిర్యాదు చేశారు. వీరి కారణంగా తనలాంటి ఎందరో ట్రాన్స్పోర్టర్లు నిలువునా మునిగిపోయామని అందులో తెలిపారు. అంతే కాదు.. కృష్ణపట్నం లాజిస్టిక్స్ కంపెనీ పేరుతో వైసీపీ నాయకులు ఎంత దండుకున్నదీ ఉప్పందించారు. వైసీపీ అధికారంలో ఉండగా.. అటువైపు కన్నెత్తి చూడని పోలీసులు.. ఫరీద్ ఫిర్యాదుతో దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం కాకాణి నేతృత్వంలోనే జరిగిందని గుర్తించారు. ఆయన(ఏ-1), ఆయన అనుచరులు 10 మందిపై ఈ నెల ఏడో తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనధికారిక టోల్ గేట్, లాజిస్టిక్స్ కంపెనీ పేరుతో ట్రాన్స్పోర్టర్లు, ఎక్స్పోర్ట్ కంపెనీల నుంచి రూ.40 కోట్లు దండుకున్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఈ డబ్బులు ఎలా చేతులు మారాయో ఆధారాలు కూడా లభ్యమైనట్లు సమాచారం. త్వరలోనే కాకాణిని ఈ కేసులో అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనపై ఇప్పటికే క్వార్ట్జ్ అక్రమ తవ్వకం, రవాణా.. అక్రమ గ్రావెల్ తవ్వకాలు, ఫొటోల మార్ఫింగ్ తదితర కేసులు ఉన్నాయి.
గుంటూరు కోర్టుకు కాకాణి
గుంటూరు: మాజీ మంత్రి కాకాణిని మంగళవారం గుంటూరు సీఐడీ పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. గతంలో ఆయన టీడీపీ నేత సోమిరెడ్డి ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసుకు సంబంధించి పీటి వారంట్పై కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించడంతో తిరిగి నెల్లూరు జైలుకు తరలించారు.