Share News

మట్కా ఆడిస్తున్నట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే వరద

ABN , Publish Date - Jun 14 , 2025 | 11:29 PM

తాను మట్కా ఆడిస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వైసీపీ నాయకులకు సవాల్‌ విసిరారు.

మట్కా ఆడిస్తున్నట్లు రుజువు చేస్తే   రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే వరద
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

ప్రొద్దుటూరు టౌన్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): తాను మట్కా ఆడిస్తున్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వైసీపీ నాయకులకు సవాల్‌ విసిరారు. శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా తానేమిటో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసునన్నారు. తాము కానీ, తన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా డబ్బులు కానీ, భూములు కానీ తీసుకున్నట్లు నిరూపించాలని పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసిన మట్కా బీటర్లను తమ శిష్యులుగా దుష్ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు సిగ్గు, లజ్జ ఉంటే నిరూపించాలని డిమాండ్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే మాటలను ఆ పార్టీ నాయకులే నమ్మరన్నారు. బ్రాందీలో నీళ్లు కలిపేవారు, గుట్కా, మట్కా నిర్వాహకులందరు వైసీపీలోనే ఉన్నారన్నారు. కూటమి ఏడాది పాలనలో సూపర్‌-6 పథకాలను అమలు చేస్తోందన్నారు. ఉచిత గ్యాస్‌, తల్లికి వందనం, పెన్షన్‌ పెంపు అమలు అవుతుండగా ఆగస్టులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతోందన్నారు. మహానాడులో చెప్పినట్లు స్టీల్‌ప్లాంట్‌ పనులు ఈనెలలోనే ప్రారంభం అవుతాయన్నారు. చంద్రబాబు నిత్యం ప్రజలతో కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారని అయిదేళ్ల పాలనలో జగన్‌ మంత్రులతోకానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలతోకానీ ఏరోజు అయినా మాట్లాడారా అని ప్రశ్నించారు. సమావేశంలో టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కుతుబుద్దీన్‌, మాజీ కౌన్సిలర్లు జంబాపురం రామాంజనేయరెడ్డి, తాటి శ్రీను, టీడీపీ నాయకులు పోసా భాస్కర్‌, గాలిపోతుల సుదర్శన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2025 | 11:29 PM