కడప వినియోగదారుల కమిషన్లో.. చైర్మన్ సహా సభ్యురాలి తొలగింపు
ABN , Publish Date - May 19 , 2025 | 11:31 PM
కడప జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్తో పాటు మరో మహిళా సభ్యురాలిని తొలగిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తుది ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కలికిరి, మే 19 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా వినియోగదారుల కమిషన్ చైర్మన్తో పాటు మరో మహిళా సభ్యురాలిని తొలగిస్తూ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తుది ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు.. కడప జిల్లా వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడిగా తప్పా అబ్దుల్రసూల్ను నియమిస్తూ అప్పటి వైసీపీ ప్రభుత్వం 2022 ఫిబ్రవరి 3న ఆదేశాలు జారీ చేసింది. నాలుగేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనతో పాటు కమిషన్లో మహిళా సభ్యురాలుగా అదే కాల పరిమితితో దండు అమృతను కూడా నియమించారు. ఈ రెండు నియామకాలకు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 5న ఇరువురూ బాధ్యతలు కూడా చేపట్టారు. కాగా అధ్య క్షుడు రసూల్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ వి.సుబ్బారెడ్డి, కలికిరి శిరీషాలు రాష్ట్ర హైకో ర్టులో ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేశారు. అధ్యక్షుడి అర్హతలు, నియామకపు ప్రక్రియ, పద్ధతులను ప్రశ్నిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అదే విధంగా దండు అమృత నియామకాన్ని సవాలు చేస్తూ వేదల చంద్రవదన అనే మహిళ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు నియామకాలను వేర్వేరుగా విచారించిన హైకోర్టు చివరకు ఇరువురి నియామకాలు చెల్లవంటూ 2024 నవంబరు 15న తీర్పు వెల్లడించింది. ఈ మేరకు తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిం చింది. ఈ లోగా హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులను సవాలు చేస్తూ అబ్దుల్ రసూల్, దండు అమృతలు వేర్వేరుగా హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. రెండు నియామకాలపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సహేతుకమేనని ఆ తీర్పును సమ ర్థిస్తూ ఈ ఇరువురి రిట్ అప్పీళ్లపై 2025 ఏప్రిల్ 25 డివిజన్ బెంచ్ తుది తీర్పు వెలువరించింది. దీనికి అనువుగా రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది. డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు వీరి నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను రద్దు చేస్తూ వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు అబ్దుల్ రసూల్, మహిళా సభ్యురాలు దండు అమృత లను పదవుల నుంచి వైదొలగాల్సిందిగా ఆదేశిస్తూ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీ షియో కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం విడివిడిగా ఉత్తర్వులు జారీ చేశారు.