Share News

తిరుమలలో ముగిసిన జ్యేష్ఠాభిషేకం మరోసారి స్వర్ణ కవచంతో మలయప్ప దర్శనం

ABN , Publish Date - Jun 12 , 2025 | 05:45 AM

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం బుధవారం ముగిసింది. విగ్రహాల పరిరక్షణ కోసం టీటీడీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

తిరుమలలో ముగిసిన జ్యేష్ఠాభిషేకం మరోసారి స్వర్ణ కవచంతో మలయప్ప దర్శనం

తిరుమల, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం బుధవారం ముగిసింది. విగ్రహాల పరిరక్షణ కోసం టీటీడీ ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలిరోజు వజ్ర కవచం, రెండో రోజు ముత్యపు కవచంలో దర్శనమిచ్చిన మలయప్పస్వామి చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి తిరిగి బంగారు కవచాన్ని ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్ఠాభిషేకం వరకు ఏడాది పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంలోనే ఉంటారు. ముందుగా ఉదయం మలయప్పస్వామి, అమ్మవార్లను శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు, వేదపారాయణదారులు మహాశాంతి హోమం నిర్వహించారు. తర్వాత ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, స్వర్ణకవచాలకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామికి ధగధగమెరిసే స్వర్ణ కవచ సమర్పణ చేశారు. అనంతరం ఉత్సవర్లు సహస్రదీపాలంకారసేవలో పాల్గొని భక్తులకు దర్శనమిచ్చారు. సేవ పూర్తికాగానే నాలుగు మాడవీధుల్లో వేంచేపుగా ఆలయానికి చేరుకున్నారు.

Updated Date - Jun 12 , 2025 | 05:45 AM