ISRO GSLV-F16 Launch: మే 22న జీఎస్ఎల్వీ-ఎఫ్16 ప్రయోగం
ABN , Publish Date - Apr 19 , 2025 | 06:05 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మే 22న జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన నిషార్ ఉపగ్రహం రోదసిలోకి పంపబడుతుంది. ఇక, నారాయణన్ గారు రాబోయే రెండేళ్లలో కులశేఖరపట్టణం నుండి రాకెట్ ప్రయోగాలు చేపడతామని వెల్లడించారు

షార్కు చేరిన రాకెట్ పరికరాలు
సూళ్లూరుపేట, చెన్నై, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి మే 22న జీఎస్ఎల్వీ-ఎఫ్16 రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన నిషార్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్లో రెండో ప్రయోగ వేదిక వద్దనున్న వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్ (వ్యాబ్లో)లో రాకెట్ అనుసంధాన పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో పాటు పీఎస్ఎల్వీ-సీ61, ఎల్వీఎం-3-జీ1, ఎల్వీఎం3-ఎం5 రాకెట్ల అనుసంధాన పనులు కూడా జరుగుతున్నాయి. జీఎస్ఎల్వీ-ఎఫ్16 అనుసంధానానికి సంబంధించిన రాకెట్ పరికరాలు కేరళలోని తిరువనంతపురం నుంచి భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక వాహనాల్లో శుక్రవారం షార్కు తీసుకొచ్చారు. ప్రయోగించే విదేశీ ఉపగ్రహాన్ని కూడా నెలాఖరులో షార్కు తీసుకురానున్నారు.
రెండేళ్లలో కులశేఖరపట్టణం నుంచి ప్రయోగాలు: నారాయణన్
రాబోయే రెండేళ్లలో కులశేఖరపట్టణం నుంచి రాకెట్ ప్రయోగాలు చేపడతామని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. తమిళనాడులోని నాగర్కోవిల్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కన్నియాకుమారిలోని సూర్యాస్తమయ ప్రాంతం వద్ద స్పేస్ పార్క్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. అందుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. కులశేఖరపట్టణంలో 95 శాతం భూమి స్వాధీనం చేసుకున్నామని, రెండేళ్లలోపు ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగం చేపడతామని తెలిపారు. 2025లో ఇస్రో అనేక విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శ్రీహరికోటలో 42 నెలల్లో మూడవ ల్యాండ్ పాడ్ ఏర్పాటు చేయనున్నామని, అందుకు కేంద్రం రూ.4,000 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు.