IPS Officer PSR: నా కేసు దర్యాప్తు చేస్తున్నది మీరేనా
ABN , Publish Date - May 30 , 2025 | 03:42 AM
ఏపీపీఎస్సీ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీలో ఉండగానే ఏసీపీని ప్రశ్నించడం వివాదంగా మారింది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కఠిన షరతులు విధించనున్నట్లు ప్రకటించింది.

ఓ ఏసీపీని ప్రశ్నించిన పీఎ్సఆర్.. విచారణ మధ్యలో వేరే చాంబర్లోకి
కస్టడీలో ఉండగా జరిగిన ఘటన.. విధుల్లో ఉన్న ఐపీఎ్సలా వ్యవహారం
(విజయవాడ-ఆంధ్రజ్యోతి)
‘నా కేసును దర్యాప్తు చేస్తున్నది మీరేనా? ఎక్కడి ఏసీపీ మీరు?’ అంటూ ఏపీపీఎస్సీ గ్రూపు-1 కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు పోలీసు కస్టడీలో ఓ ఏసీపీని ప్రశ్నించారు. కేసులో నిందితుడిగా ఉన్న పీఎ్సఆర్ విధుల్లో ఉన్న ఐపీఎ్సగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను కోర్టు రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. 25వ తేదీ ఉదయం నుంచి 26వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఆయన సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఉన్నారు. పీఎస్ఆర్తో పాటు కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పమిడికాల్వ మధుసూదన్ కూడా స్టేషన్లోనే ఉన్నారు. నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్... పీఎ్సఆర్, మధుసూదన్ను విడివిడిగా విచారించారు. తొలిరోజు విచారణలో మధ్యాహ్నం కాగానే, పీఎ్సఆర్ టాయ్లెట్కు వెళ్తానని చెప్పారు. ఆయన గదిలో నుంచి బయటకు రాగానే సిబ్బంది టాయ్లెట్లు చూపించారు. టాయ్లెట్కు వెళ్లొచ్చిన తర్వాతపీఎస్ఆర్ విచారణ గదిలోకి వెళ్లకుండా పక్కనున్న ఏడీసీపీ చాంబర్కు వెళ్లారు. ఆ చాంబర్లో ఇద్దరు ఏసీపీలు కూర్చున్నారు. ఆయనను చూడగానే ఇద్దరు ఏసీపీల్లో ఒకరు బయటకు వెళ్లిపోయారు. తనను చూసి నిలబడిన మరో ఏసీపీని పీఎ్సఆర్ ప్రశ్నలు వేశారు. ‘నా కేసు (ఏపీపీఎస్సీ)ను మీరే దర్యాప్తు చేస్తున్నారా? మీరు ఎక్కడి ఏసీపీ?’ అని అడిగారు. కేసుతో సంబంధం లేనప్పుడు ఇక్కడెందుకున్నారన్న అర్థం వచ్చేలా పీఎస్ఆర్ మాట్లాడారు. ఆయన అడిగిన ప్రశ్నలకు ఏసీపీ సమాధానం చెప్పడంతో సరేనంటూ వెళ్లిపోయారు. టాయ్లెట్కు వెళ్లిన పీఎ్సఆర్ అక్కడి నుంచి నేరుగా ఏడీసీపీ చాంబర్లోకి వెళ్లి ఏసీపీని ప్రశ్నించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
పీఎస్ఆర్కు కఠిన షరతులు విధిస్తాం: హైకోర్టు
అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎ్సఆర్ ఆంజనేయులకు బెయిల్ మంజూరు సందర్భంగా కఠిన షరతులు విధిస్తామని హైకోర్టు ప్రకటించింది. దీనికి సంబంధించి సవివర ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై. లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సినీనటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదుచేసిన కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పీఎ్సఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా పీఎ్సఆర్ తరఫున న్యాయవాది నగేశ్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ 37 రోజులుగా జైల్లో ఉన్నారన్నారు. ఆయనపై అక్రమ కేసు పెట్టారని తెలిపారు. పిటిషనర్ మినహా నిందితులు బెయిల్ పొందారని పేర్కొన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. జత్వానీపై పోలీసులు పెట్టింది అక్రమ కేసా? కాదా? అని తేల్చాల్సింది ట్రయల్ కోర్టు మాత్రమేనని అన్నారు. కేసు దర్యాప్తు పూర్తి చేసి, చార్జిషీట్ దాఖలు చేయడం వరకే పోలీసుల పని అని తెలిపారు. తమపై అక్రమ కేసు పెట్టారని నిందితులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసులు పెట్టుకుంటూ పోతే న్యాయ విచారణకు అంతు ఉండదన్నారు. కేసులో నిందితులుగా ఉన్న ఇతర పోలీసు అధికారులను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఉన్నతాధికారి చెప్పారని ఐపీఎస్ అధికారులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడతారా? వారికి విచక్షణ లేదా? అని ప్రశ్నించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ బదులిస్తూ.. కేసు నమోదుకు ముందే జత్వానీపై పిటిషనర్, ఇతర నిందితులు కుట్ర పన్నారని తెలిపారు. కేసు నమోదు చేయడానికి ఒకరోజు ముందే ముంబైకి వెళ్లి జత్వానీని అరెస్టు చేసేందుకు విమాన టికెట్లు బుక్ చేశారన్నారు. పిటిషనర్ సూచనలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులు, ఇతర పోలీసు అధికారులు నడుచుకున్నారన్నారు. సాక్ష్యుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కేసు దర్యాప్తును పిటిషనర్ ప్రభావితం చేస్తున్నారని, దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్నారని తెలిపారు. వాట్సప్ కాల్ వివరాలను కోర్టు ముందు ఉంచారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పీఎ్సఆర్ బెయిల్ మంజూరు సందర్భంగా కఠిన షరతులు విధిస్తామని ప్రకటించారు.