Marital Harassment: ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
ABN , Publish Date - Dec 02 , 2025 | 06:15 AM
ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహ త్య చేసుకొన్న ఘటన కలకలం రేపింది.
భర్త, అత్తింటి వేధింపులే కారణం: మాధురి తల్లిదండ్రులు
వాళ్లే చంపేశారంటున్న భర్త రాజేశ్
నంద్యాల/తాడేపల్లి/మంగళగిరి సిటీ, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహ త్య చేసుకొన్న ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వారి నివాసంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆత్మహత్య చేసుకున్న యువతిది కులాంతర ప్రేమ వివాహం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లి పోలీసులు యువతి తల్లి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె తండాకు చెందిన చిన్నరాముడు, లక్ష్మీభాయి దంపతులకు కుమారుడు, కుమార్తె మాధురి సాహితి బాయి (25) ఉన్నారు. ఐఏఎస్ హోదాలో ఉన్న చిన్నరాముడు ప్రస్తుతం రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యదర్శిగా గుంటూరులో పనిచేస్తూ.. తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె మాధురి బుగ్గానిపల్లెకు చెందిన బోయ రాజేశ్ నాయుడు అనే వ్యక్తిని ప్రేమించింది. ఈ ఏడాది మార్చి 5న నంద్యాల జిల్లా మహానంది ఆలయంలో వివాహం చేసుకొన్నారు. రాజేశ్ తమ కుమార్తెను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మాఽధురి తల్లిదండ్రులు అప్పట్లో నంద్యాల ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్పీ ఇరువర్గాలను పిలిపించి మాట్లాడగా.. మాధురి తన భర్తతో వెళ్తానని చెప్పడంతో ఆమెను భర్త వెంట పంపించారు. మార్చి 7న యువతి తల్లిదండ్రుల ఆమోదంతో బేతంచెర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహ రిజిస్ర్టేషన్ కూడా చేయించుకున్నారు. మాధురి 3 నెలల క్రితం ‘మిమ్నల్ని చూడాలని ఉంది. మీతో ఉండాలని ఉంది’ అంటూ తల్లిదండ్రుల సెల్ఫోన్కు మెసేజ్ పంపింది. దీంతో వారు బేతంచెర్ల మండలం సిమెంట్ నగర్కు వచ్చారు. ఇరువర్గాలు బేతంచెర్ల పోలీసులను సెప్టెంబరు 3న ఆశ్రయించాయి. పోలీసులు ఇరువర్గాల సమక్షంలో మాధురిని విచారించి ఆమె ఇష్టపూర్వకంగానే తల్లిదండ్రులకు అప్పగించారు. తన భర్తకు ఉద్యోగం లేదని, ఉద్యోగం వచ్చిన తర్వాత వస్తానంటూ మాధురి పోలీసులకు లిఖితపూర్వకంగా రాసిచ్చి తల్లిదండ్రులతో వెళ్లిపోయింది.
భర్త వేధింపులకు తాళలేకే..: తల్లిదండ్రులు
తమ కుమార్తెను రాజేశ్ నాయుడు ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, పెళ్లి చేసుకొని వేధింపులకు గురిచేశాడని, ఆ వేధింపులకు తాళలేకే బలవన్మరణానికి పాల్పడిందని మాధురి తల్లిదండ్రులు లక్ష్మీభాయి, చిన్నరాముడు ఆరోపించారు. మంచి ఉద్యోగం, జీతం వస్తుందని చెప్పి నమ్మబలికాడని పేర్కొన్నారు. తమ కుమార్తెపై వున్న మమకారంతో రాజేష్ డిమాండ్ మేరకు 20 తులాల బంగారం, కొంత నగదు ఇచ్చామని వెల్లడించారు. పెళ్లయిన రెండు నెలల తర్వాత తమ కుమార్తె భర్త వేధింపుల గురించి చెప్పిందన్నారు. అత్తింటికి వెళ్లి అనేక మార్లు ప్రాధేయపడినప్పటికీ.. వేధింపులు తగ్గకపోవడంతో తమ కుమార్తెను పుట్టింటికి తీసుకొచ్చామని తెలిపారు. భర్త వేధింపులను గుర్తుచేసుకుని, మానసిక క్షోభను భరించలేక ఆత్మహత్యకు పాల్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వాళ్లే చంపేశారు..: రాజేశ్ నాయుడు
తన భార్య మాధురి మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ రాజేశ్ నాయుడు సోమవారం నంద్యాల ఎస్పీని ఆశ్రయించారు. ఆమె తల్లిదండ్రులే హత్య చేశారంటూ మీడియా ఎదుట ఆరోపించారు. తనకు కూడా ప్రాణహాని ఉందని.. తన భార్య గర్భవతి కూడా అని పేర్కొన్నారు. తన భార్య మృతిపై లోతుగా దర్యాప్తు చేసి అసలు విషయాలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మంగళవారం బేతంచెర్ల మండలం బుగ్గానపల్లె తండాకు వెళ్లనున్నారు.