Share News

PSR Anjaneyulu: హాయ్‌ల్యాండ్‌ వేదికగా అక్రమాలు

ABN , Publish Date - Apr 30 , 2025 | 05:26 AM

వైసీపీ హయాంలో గ్రూప్-1 పరీక్షల జవాబు పత్రాలను గుంటూరులోని హాయ్‌ల్యాండ్ రిసార్ట్స్‌లో మూల్యాంకనం చేయడం పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయ పోరాటంతో హైకోర్టు రెండు సార్లు మూల్యాంకనం చేయించాలని ఆదేశించింది.

PSR Anjaneyulu: హాయ్‌ల్యాండ్‌ వేదికగా అక్రమాలు

  • గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాలు రెండు సార్లు మూల్యాంకనం

  • పీఎస్ఆర్‌ నేతృత్వంలో మొదటిసారి

  • కోర్టు ఆర్డర్‌తో రెండోసారి దిద్దుబాటు

  • అభ్యర్థులు పసిగట్టి న్యాయ పోరాటం

  • హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనంపై గోప్యత పాటించిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

  • పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిన వైనం

  • ఎవరి కోసం ఈ అడ్డగోలు మూల్యాంకనాలు?

  • విచారణలో కూపీ లాగుతున్న అధికారులు

  • ఐపీఎస్‌ ఆంజనేయులు చుట్టూ ఆరోపణలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఐపీఎస్‌ అధికారి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ఉన్న సమయంలో గ్రూప్‌-1లో అక్రమాలు జరిగాయి. అసలు ఆఫీసుతో సంబంధం లేని గుంటూరులో ఉన్న పర్యాటక ఆతిథ్య ప్రాంతం హాయ్‌ల్యాండ్‌ రిసార్ట్స్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారు. అప్పుడే అక్రమాలు జరిగాయన్న విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రెండోసారి మూల్యాంకనం చేయించినా, రెండుసార్లు మూల్యాంకనం జరిగిందనే విషయాన్ని ఏపీపీఎస్సీ గోప్యంగా ఉంచింది. హాయ్‌ల్యాండ్‌ అనే పేరు కూడా తమకు తెలియదన్నట్టుగా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొని అడ్డంగా దొరికిపోయింది. హాయ్‌ల్యాండ్‌లో మొదటిసారి మూల్యాంకనం కోసం చేసిన ఏర్పాట్లు, నగదు చెల్లింపుల వివరాలను అభ్యర్థులే స్వయంగా ఆధారాలతో సహా నిరూపించారు. దీంతో హైకోర్టు మెయిన్స్‌ను రద్దు చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక చక్రం తిప్పింది అప్పట్లో కార్యదర్శిగా వ్యవహరించిన పీఎ్‌సఆర్‌ ఆంజనేయులేనని స్పష్టమవుతోంది.


ఎప్పుడెప్పుడు ఏం జరిగింది?

  • 2018లో ఏపీపీఎస్సీ 169 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. నోటిఫికేషన్‌లో మాన్యువల్‌ విధానం(చేతితో దిద్దే)లో మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతుందని పేర్కొంది. వైసీపీ హయాంలో 2020, డిసెంబరు 14 నుంచి 20 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరిగాయి. 6,807 మంది అభ్యర్థులు మెయిన్స్‌ రాశారు. కరోనా కారణం చూపుతూ ఏపీపీఎస్సీ మాన్యువల్‌గా కాకుండా డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేయించింది. దీనిపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా మాన్యువల్‌గానే మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.

  • ఆ సమయంలో ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న పీఎ్‌సఆర్‌ అడ్డగోలు వ్యవహారాలకు తెరతీశారు. ఏపీపీఎస్సీతో ఎలాంటి సంబంధం లేని గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌ రిస్టార్ట్స్‌లో మూల్యాంకనం చేయించేందుకు ఏర్పాట్లు చేశారు. మూల్యాంకనం చేసే ప్రొఫెసర్లకు ఏర్పా ట్లు, ఇతర సిబ్బంది అవసరాలకు కామ్‌సైన్‌ అనే కంపెనీకి రూ.1.14 కోట్లు చెల్లించారు. 2021, డిసెంబరులో ప్రారంభించిన మూల్యాంకనానికి హాయ్‌ల్యాండ్‌లో 26 రోజులకు హాల్‌ అద్దె, సిబ్బందికి భోజనాలు, ఇతర అవసరాలంటూ రూ.20.06 లక్షలు చెల్లించారు. ఓఎంఆర్‌ షీట్లు, డిజైన్‌ కోసం మరో కంపెనీకి నిధులు విడుదల చేశారు.

  • హాయ్‌ల్యాండ్‌లో జవాబుపత్రాలకు భద్రత కోసం కర్నూలు పోలీస్‌ యూనిట్‌ నుంచి 15 రోజులకు ఒక బ్యాచ్‌ చొప్పున 32 మంది సిబ్బందిని హాయ్‌ల్యాండ్‌లో నియమించారు. 2021, డిసెంబరు 5 నుంచి 2022, ఫిబ్రవరి 26 వరకు వారు అక్కడే ఉన్నారు. అంతకముందు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి గుంటూరులోని హాయ్‌ల్యాండ్‌కు జవాబుపత్రాల తరలింపునకు గుంటూరు అర్బన్‌ ఎస్పీకి పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు లేఖ రాశారు.

  • హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ రెండోసారి మాన్యువల్‌గా జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించి తుది ఫలితాలు ప్రకటించింది. రెండోసారి ఏపీపీఎస్సీ కార్యాలయంలోనే మూల్యాంకనం జరిగింది. అంతకంటే ముందే పీఎ్‌సఆర్‌ను అప్పటి ప్రభుత్వం బదిలీ చేసింది.


ఆధారాలున్నా అడ్డగోలు వాదన

గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాలను హాయ్‌ల్యాండ్‌లో మొదటిసారి మూల్యాంకనం చేశారనేందుకు పలు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా అప్పటి వైసీపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అప్పటి చైర్మన్‌ గౌతం సవాంగ్‌లు ఈ వాదనను తోసిపుచ్చారు. తొలిసారి మాన్యువల్‌ మూల్యాంకనం చేసినప్పుడు తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థులు ఎంపిక కాలేదనే ఉద్దేశంతో రెండోసారి మూల్యాంకనం చేశారని, ఫలితంగా డిజిటల్‌ మూల్యాంకనానికి, రెండోసారి మాన్యువల్‌ మూల్యాంకనానికి మధ్య ఎంపికైన అభ్యర్థుల్లో 62శాతం వ్యత్యాసం వచ్చిందని అభ్యర్థులు వాదించారు. డిజిటల్‌ మూల్యాంకనం చేసినప్పుడు ఇంటర్వ్యూలకు 326 మందిని ఎంపిక చేయగా, వారిలో 202 మంది రెండోసారి మాన్యువల్‌ మూల్యాంకనంలో అనర్హులుగా మారారు. అయితే, అసలు మొదటిసారి మూల్యాంకనం చేశారనే విషయాన్ని ఏపీపీఎస్సీ దాచిపెట్టి, అసలు హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనమే జరగలేదని కోర్టుకు తెలిపింది. కానీ, అభ్యర్థులు దీనికి సంబంధించి పలు ఆధారాలను సమర్పించడంతో న్యాయస్థానం ఏకీభవించింది.

ప్రైవేటు రిసార్ట్స్‌లో ఎందుకు?

ఈ మొత్తం వ్యవహారంలో హాయ్‌ల్యాండ్‌లో మూల్యాంకనం అనుమానాస్పదంగా మారింది. అసలు ఒక ప్రైవేటు రిస్టార్ట్స్‌లో అత్యంత కీలకమైన గ్రూప్‌-1 జవాబు పత్రాలను మూల్యాంకనం ఎందుకు చేయించారనేది ప్రధాన ప్రశ్న. ఆ సమయంలో చైర్మన్‌ కూడా లేకపోవడంతో అన్నీ తానై వ్యవహరించిన పీఎ్‌సఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం ఏ పోటీ పరీక్షల మూల్యాంకనం అయినా ఏపీపీఎస్సీ కార్యాలయంలోనే జరగాలి. కానీ, దీనికి విరుద్ధంగా వ్యవహరించిన పీఎ్‌సఆర్‌ ప్రైవేటు రిసార్ట్స్‌కు జవాబుపత్రాలను తరలించారు. పైగా ఏర్పాట్ల కోసం రూ.1.14 కోట్లు చెల్లించారు. అసలు ప్రైవేటు ప్రాంతంలో మూల్యాంకనం ఎందుకు చేశారనే కోణంలోనే ఇప్పుడు పీఎ్‌సఆర్‌పై నమోదైన కేసులో అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీలకు మేలు చేయడం కోసమే మూల్యాంకనాన్ని అక్కడికి మార్చారా? లేక, కావాల్సిన వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం చేశారా? అనే అంశాలపై దృష్టి సారించారు.


గున్నీతో మాట్లాడినట్లు గుర్తులేదు: పీఎస్‌ఆర్‌

  • దర్యాప్తు అధికారి: జెత్వానీ కేసు వల్లే మీరు సస్పెండ్‌ అయ్యారా?

  • పీఎస్‌ఆర్‌: నాపై తప్పుడు కేసు పెట్టారు.

  • దర్యాప్తు అధికారి: విశాల్‌ గున్నీతో జెత్వానీ కేసు గురించి ఏమైనా మాట్లాడారా?.

  • పీఎస్‌ఆర్‌: విశాల్‌ గున్నీతో మాట్లాడినట్టుగా గుర్తులేదు.

...ఇవీ సీఐడీ విచారణలో ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు చెప్పిన సమాధానాలు! సీఐడీ అధికారులు మంగళవారం కానూరులోని తమప్రాంతీయ కార్యాలయంలో పీఎ్‌సఆర్‌ను ప్రశ్నించారు. రెండు దర్యాప్తు బృందాలు 40 ప్రశ్నలు సంధించాయి. అడిగిన ప్రతి ప్రశ్నకు తనకేమీ తెలియదనే సమాధానం మాత్రమే వచ్చింది. సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ గురించి ప్రశ్నించినప్పుడు.. తనకు సెల్‌ఫోన్‌ మాత్రమే ఉందని, ఇంటెలిజెన్స్‌ డీజీగా పనిచేసిన ఐదేళ్లలో ఏనాడూ ట్యాబ్‌ ఉపయోగించలేదని చెప్పా రు. ముంబై నటి జెత్వానీ, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ గురించి ప్రశ్నించినప్పుడు.. వాళ్లెవరో తనకు తెలియదన్నారు. విశాల్‌ గున్నీతో ఈ కేసు గురించి మాట్లాడారా? అని అడిగితే.. ‘నాకేమీ గుర్తులేదు’ అంటూ దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారు.

Updated Date - Apr 30 , 2025 | 05:29 AM