Anti Jagan Rally: గో బ్యాక్ జగన్
ABN , Publish Date - Jun 04 , 2025 | 06:36 AM
తెనాలిలో జగన్ పర్యటన సందర్భంగా దళిత సంఘాలు తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేశాయి. రౌడీషీటర్లకు మద్దతు ఇచ్చిన వైఖరిపై నల్ల బెలూన్లు, కండువాలతో "గో బ్యాక్ జగన్" అంటూ ఘాటుగా స్పందించారు.

తెనాలిలో దళిత సంఘాల నిరసనలు
తెనాలి, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): తెనాలి పర్యటనలో వైసీపీ అధినేత జగన్కు దళిత సంఘాల నుంచి తీవ్రమైన నిరసనల సెగ తగిలింది. ‘దళితులను పొట్టనబెట్టుకున్న రౌడీషీటర్లకు అండగా నిలుస్తావా? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్?’ అంటూ ప్రజాసంఘాలు మండిపడ్డాయి. ‘గో బ్యాక్ జగన్...’ అంటూ పెద్దగా నినదిస్తూ నిరసన తెలిపాయి. తెనాలిలోని ఐతానగర్ సెంటర్కు వెళ్లే మార్గంలోనే ఎస్సీ సెల్ నాయకులు, ఇతర ప్రజా సంఘాలు, దళిత సంఘాల నాయకులు నల్ల బెలూన్లు పట్టుకుని, నల్ల కండువాలు, చొక్కాలు ధరించి జగన్ తీరును నిరసించారు. ప్లకార్డులు చూపుతూ, బెలూన్లు ఎగరువేస్తూ జగన్ కాన్వాయ్కు అడ్డుగా దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకుని, చెదరగొట్టారు. తెనాలి మార్కెట్ సెంటర్లో ఎమ్మార్పీఎస్ నాయకుడు ఉన్నం ధర్మారావు, దళిత సంఘాల నాయకుడు సుద్దపల్లి నాగరాజు ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. తెనాలి వదిలి జగన్ వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. రౌడీషీటర్లకు మద్దతుగా ఎలా వస్తారంటూ ఆగ్రహించారు.